Maganti Gopinath Is No More | హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూన్ 5న ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.  

ఇటీవల ఆయనకు కార్డియాక్‌ అరెస్టు కాగా, డాక్టర్లు సీపీఆర్‌ చేయడంతో గుండె తిరిగి కొట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పిందని అంతా అనుకున్నారు. నాడి సాధారణ స్థితికి వచ్చినా ఆయన కోమా నుంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారని వైద్యులు తెలిపారు. 

తెలంగాణ సీఎం సంతాపం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాగంగి గోపినాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేసీఆర్ సంతాపం..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీ కి తీరనిలోటు అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతిపట్ల తన సంతాపాన్ని ప్రకటించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన నేత మాగంటి గోపీనాథ్. ఎంతో సౌమ్యుడు, ప్రజానేత గా పేరు సంపాదించిన నేత అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. 

మాగంటి గోపినాథ్‌ను కాపాడుకునేందుకు డాక్టర్లు గత మూడు రోజులుగా  చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరం అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాగంటి గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

మాగంటి సేవలను గుర్తుచేసుకున్న కేటీఆర్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నా కేటీఆర మాగంటి గోపినాథ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు కేటీఆర్.

మాగంటి మృతి బాధాకరం.. హరీష్ రావు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరం అన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి మృతి బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన నేతగా కొనియాడారు. మాగంటి గోపినాథ్  ఆత్మకు శాంతి చేకూరాలని హరీష్ రావు ప్రార్థించారు.