ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. అధికార పార్టీ అనే ధీమాతో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో బల్దియా అధికారులు కొరఢా ఝులిపించారు. ఎమ్మెల్యేకు ఏకంగా లక్ష రూపాయల ఫైన్ విధించారు. 

అనుమతి లేకుండానే ఫ్లెక్సీలు

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ తన నియోజకవర్గ పరిధిలో కటౌట్లతో నింపేశారు ఎమ్మెల్యే. హబ్సీగూడ నుంచి ఉప్పల్ వరకు భారీగా తోరణాలు కట్టారు. ఎక్కడ చూసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపుల కటౌట్లు ఏర్పాటు చేయడంతో రోడ్డు ఇరుకుగా మారింది. 

ఐదు వేల నుంచి పదిహేను వేల వరకు ఫైన్

స్కై వే నిర్మాణంతో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు రూ.5 వేలు మొదలుకుని రూ.15 వేల వరకు జరిమానా విధించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి రూ. లక్ష ఫైన్ విధించినట్లు అధికారులు తెలిపారు. 

గురువారం రాత్రి అధికారులు ఫైన్ విధించినా.. శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇతర పార్టీల కటౌట్లు మాత్రం వెంటనే తొలిగించే అధికారులు అధికార పార్టీ నాయకుల కటౌట్లను మాత్రం అలాగే వదిలేయడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అప్పట్లో మంత్రులకు షాక్‌ ఇచ్చిన అధికారులు 

టీఆర్ఎస్ పార్టీ 20వ ప్లీనరీ టైంలో కూడా నగరంలో ఆ పార్టీ నేతలు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీల ఏర్పాటుపై చర్యలు తీసుకున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. భారీగా జరిమానాలు విధించారు. అత్యధికంగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.2 లక్షల 35 వేల జరిమానా, మంత్రి తలసానికి రూ.లక్ష 5 వేల జరిమానా, మంత్రి మల్లారెడ్డికి రూ.10,000, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.25 వేలు జరిమానా వేసింది. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరుతో  రూ. 95000 జరిమానా వేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు రెండు లక్షలు జరిమానా విధించారు.