DK Aruna in Assembly: గద్వాల ఎమ్మెల్యే ఎన్నికపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడం తెలిసిందే. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హతా వేటు వేసి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. ఇందులో యాభై వేల రూపాయలు డీకే అరుణకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆగస్టు 24వ తేదీన ఈ తీర్పు వచ్చింది. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందించి.. తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరేందుకు శుక్రవారం అసెంబ్లీకి వెళ్లిన డీకే అరుణకు చేదు అనుభవం ఎదురైంది.          

  


దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లారు డీకే అరుణ. గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందించడానికి వెళ్లారామె. అయితే ఆ సమయంలో కార్యదర్శి అందుబాటులో లేరు. స్పీకర్ కూడా లేకపోవడంతో డీకే అరుణ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 


ఆగస్టు 24వ తేదీన తీర్పు వచ్చింది, ఆర్టర్ కాపీతో స్పీకర్ ను కలవడానికి వస్తే.. స్పీకర్ లేరు, కార్యదర్శి కూడా లేరని డీకే అరుణ అన్నారు. గురువారం సాయంత్రం ఫోన్ చేశానని, మెసేజ్ కూడా పెట్టానని తెలిపారు. ప్రతి రోజూ అసెంబ్లీకి వచ్చే కార్యదర్శి ఈరోజు మాత్రం ఎందుకు రాలేదోనని అన్నారు. కార్యదర్శిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. ముందు సమాచారం ఇచ్చినా స్పీకర్, కార్యదర్శి ఇద్దరూ లేకపోవడం బాధాకరమని డీకే అరుణ అన్నారు. కోర్టు తీర్పు కాపీని స్పీకర్ పేషీలో ఇచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పును అమలు చేయాలని కోరారు. ఈ తీర్పు నాలుగేళ్ల క్రితమే వచ్చి ఉంటే.. గద్వాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేదని తెలిపారు. 


గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే డీకే అరుణను గుర్తించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనిపై సోమవారం భారత ఎన్నికల ప్రధాన అధికారిని కలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. డీకే అరుణ విషయంలో వచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 


Also Read: Daughter Killed Mother: తల్లి ప్రియుడినే లైన్‌లో పెట్టిన కుమార్తె- ఫ్యామిలీలో వివాదాలతో వైల్డ్‌ డెసిషన్ తీసుకున్న బాలిక


2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా  28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి  బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది.  మళ్లీ ఎన్నికల కోసం  కేసీఆర్ ..  బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులోనూ.. కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థిగా చోటు దక్కించుకున్నారు. 


కొద్ది రోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేలపైనా ఇలాగే అనర్హతా వేటు వేశారు. దీంతో ఆయన సుప్రీంకర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా తో పోటీలో ఓడిపోయిన జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టు స్టే వల్ల ప్రమాణస్నీకారం చేయలేకపోయారు.