Dasoju Sravan Letter to Governor Tamilisai: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ ను ఎమ్మెల్సీగా సిఫార్సు చేయగా.. దాన్ని అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో దాసోజు శ్రవణ్ తాజాగా గవర్నర్ తమిళిసై తీరుపై ప్రశ్నించారు. ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తారనే వార్తలు రానున్న వేళ.. దాసోజు శ్రవణ్ ఈ లేఖ రాశారు.


‘‘గౌరవనీయులైన మాజీ గవర్నర్, శ్రీమతి డా. తమిళిసై గారు.. పార్లమెంటు సభ్యురాలిగా పోటీ  చేసేందుకై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా తోడ్పడుతుందని భావిస్తున్నాను.


మార్చి 7, 2024 నాటి WP 180 & 181 కేసుల్లో ఇటీవలి హైకోర్టు ఆదేశాల తర్వాత న్యాయం గెలుస్తుందని ఆశించి మీకు విన్నవించుకున్నాం. కోర్టు ఆదేశాలు అమలు చేయండి, రాజ్యాంగాన్ని కాపాడండి, మా లాంటి వెనుకబడినవర్గాలకు చెందినవారికి న్యాయం చేయమని చేతులు జోడించి నమస్కరించాం. మీరు మీ మునుపటి చట్ట విరుద్దమైన నిర్ణయాన్ని సరిచేసి మమ్మల్ని శాసన మండలి సభ్యులు గా నియమిస్తారని ఎంతగానో ఆశించాం. 


అయితే, అపరిపక్వ, తప్పుడు  న్యాయ సలహాపై మీరు ఆధారపడటం అంతేకాక మీ  వివాదాస్పద రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కారణంగా మాకు తీరని అన్యాయం జరిగింది. మేము చాలా అట్టడుగు వర్గాల నుండి వచ్చాం. తమరి చట్టవిరుద్దమైన నిర్ణయం వలన మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు రాజకీయ నేపథ్యం ఉన్నది అనే కుంటి సాకుతో  మా త్యాగాలు, అర్హతలు, సమాజానికి మేము చేసిన కృషిని తమరు విస్మరించారు.


దానితోపాటు, గత ప్రభుత్వం పట్ల మీకున్న రాజకీయ శత్రుత్వం ప్రదర్శించారు.  రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టిస్తూ , చట్టవిరుద్ధమైన మీ నిర్ణయంతో మా కెరీర్‌లు, భవిష్యత్తు,  జీవితాలు నాశనం చేశారనే విషయాన్నీ గుర్తిస్తూ, మీరు దయతో ఆత్మ శోధన చేసుకోవాలని విజ్ఞప్తి. 


మీ తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం అయినప్పటికీ, మీ రాజకీయ జీవితంలో మీరు తప్పనిసరిగా  విజయం సాధించాలని మేము హృదయపూర్వకంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు’’ అని డాక్టర్ శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ రాశారు.