తెలంగాణ అసెంబ్లీలో చివరి రోజు జరుగుతున్న సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వాకౌట్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్దకు వచ్చి సీతక్క మీడియాతో మాట్లాడారు. తనకు స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని.. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని వాపోయారు. విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ఆమె అసెంబ్లీ బయట ఆగ్రహం వ్యక్తం చేశారు. 


జీరో అవర్‌లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని అనుకున్నామని అన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా మాట్లాడాలని ఆమె ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయడం లేదని, తాము ఒక నిమిషం మాట్లాడకుండానే మైకులు ఆపేస్తున్నారని అన్నారు. 


ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ సభను వాడుకుంటోందని సీతక్క అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేస్తున్నారని అన్నారు. సమస్యలు లేనప్పుడు ఆ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లోలో ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సభ నిర్వహణ తమకు బాగా బాధ కలిగిస్తుందని సీతక్క అన్నారు. ఓవైపు మిషన్ భగీరథ నీళ్లు ఇస్తుండగా, ప్రతి ఊళ్ళో వాటర్ ప్లాంట్‌లు ఎందుకు పెట్టారని సీతక్క ప్రశ్నించారు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.


అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత
అసెంబ్లీ ఎదురుగా రహదారిపై ఉద్రిక్తత జరిగింది. అసెంబ్లీని ముట్టడించడానికి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నేతలు, విద్యార్థులు ప్రయత్నించారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగి అసెంబ్లీ వద్దకు వచ్చి లోనికి చేరుకొనే ప్రయత్నం చేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాలు, ముందరి ప్రాంగణం ఉద్రిక్తతంగా మారింది. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.