తెలంగాణ ప్రగతి రథ చక్రాలు ముందుకు సాగుతూనే ఉంటాయని, దేశంలో తెలంగాణ మోడల్ మర్మోగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల దీవెనలతో ప్రగతి రథ చక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతాయని, దీనికి అడ్డుపడాలనే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని అన్నారు. మన సమైక్యతే మన బలం అని అన్నారు. సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ ప్రగతిని ఇదే విధంగా కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు అయ్యారు. పబ్లిక్‌ గార్డెన్స్‌ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఎగరవేసి ప్రసంగించారు. అంతకుముందు సమీపంలోని గన్‌ పార్కులో అమర వీరులకు సీఎం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు ఉన్నారు.


రాష్ట్ర సాధనతోనే నా జన్మ సాకారం - కేసీఆర్
పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన, జరుగుతున్న ప్రగతిని వివరించారు. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ఓ ప్రత్యేకత ఉందని వివరించారు. న్యాయం, ధర్మం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని.. ఆనాటి సామాన్యులు చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయని అన్నారు. గాంధీ, నెహ్రు, పటేల్‌ వంటి నేతల వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైందని.. తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందని అన్నారు. తెలంగాణ సాధనతోనే తన జన్మ సాకారమైందని అన్నారు. 


పెండింగ్‌లో ప్రాజెక్ట్‌ల పూర్తి - సీఎం 


ప్రస్తుతం తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని..  పాలమూరు పచ్చగా మారిందని అన్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి పాలమూరును పూర్తి చేశామని అన్నారు. అలాగే 6 జిల్లాల్లో 12 లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని అన్నారు. దేవాదుల ఎత్తిపోతలతో వరంగల్‌కు త్వరలోనే సాగునీరు అందిస్తామని.. మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం అని అన్నారు. హైదరాబాద్‌‌లో పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తున్నామని అన్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తామని చెప్పారు.


జిల్లాలో మెడికల్ కాలేజీ కల సాకారం
వైద్యవిద్యలో కూడా అనేక సంస్కరణలతో ముందుకు వచ్చామని సీఎం అన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఉన్నాయని.. మొన్న ఒకే రోజు 9 వైద్య కళాశాలలు ప్రారంభించామని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఏటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నామని అన్నారు.  అటు దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు వచ్చాయని.. దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లేదని అన్నారు.


తలసరి ఆదాయంలో నెంబర్ 1
తలసరి ఆదాయంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తున్నామని వివరించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం నిరంతరం కొనసాగుతుందని.. అర్హుందరికీ డబుల్‌ బెడ్ రూం ఇళ్లు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. పెన్షన్‌ లబ్దిదారుల వయస్సును 57 ఏళ్లకు తగ్గించామని గుర్తు చేశారు.