సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం కాబోతున్న వేళ ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని ఆశిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. వందే భారత్ రైలు తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక అని కిషన్‌ రెడ్డి అన్నారు. 


ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు దేశ వ్యాప్తంగా 6వ వందేభారత్‌ రైలు. మొత్తంగా 100 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించాము. ప్రతి రైలుని ప్రధాని మోదీనే ప్రారంభిస్తారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కలలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారు. రైల్వేలో సంచలన మార్పులు మాత్రమే కాకుండా ప్రధాని మోదీ తక్కువ ధరలకు మందులు, వ్యాక్సిన్‌‌ లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజల వద్దకే వైద్యం లక్ష్యంగా లక్షా యాభై వేల వెల్‌నెస్‌ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించింది. ప్రతి నెలా మూడో వారంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నాం. ఇప్పటికే 1.5 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశాం. 2023 ఆగస్టు 15లోపు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు.






వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మొత్తం 1128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉందని అధికారులు వెల్లడించారు. ఒక్కో కోచ్ పొడవు 23 మీటర్లు కాగా, 52 మంది కూర్చునేలా ఫస్ట్ క్లాస్ కోచ్‌లు రెండున్నాయి. రైలును స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌, అటెండెంట్‌ కాల్‌ బటన్లు, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, పడుకునే సౌకర్యం కలిగిన కుర్చీలతో అత్యధునికంగా తీర్చిదిద్దారు.  ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్‌ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్‌ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్‌ బ్యాక్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.


కేటీఆర్‌పై విమర్శలు


మంత్రి కేటీఆర్‌ పైనా కిషన్‌ రెడ్డి ఈ ప్రెస్ మీట్‌లో విమర్శలు చేశారు. కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌ కంటే దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో కిందిస్థాయి నుంచి కష్టపడి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని విమర్శించారు. సగం సగం జ్ఞానంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.