Charminar Express Accident : నాంపల్లి(Nampally)లో ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్‌(Charminar Express) పట్టాలు తప్పింది. ప్రమాదంలో 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనతో కొందరికి గుండెపోటు వచ్చినట్టు ప్రయాణికులు చెబుతున్నారు.



నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం బారిన పడింది. చెన్నై నుంచి వస్తున్న ఈ ట్రైన్ స్టేషన్‌లోనే పట్టాలు తప్పింది. ఆగే టైంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టాలు తప్పిన బోగీలు సైడ్‌ వాల్‌కు రాసుకుంటూ వెళ్లిపోయాయి. 



డెడ్‌ ఎండ్‌ గోడను ఢీ కొట్టడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో యాభై మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరికి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. 




స్టేషన్‌లో మరికొద్ది నిమిషాల్లో దిగబోతున్నామనే టైంలో ఇలా ప్రమాదం బారిన పడటం ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. స్వల్ప గాయాలతోనే బయటపడ్డామని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 బోగీలు దెబ్బతిన్నాయి. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులే గాయపడ్డారు. 

 


నాంపల్లి రైలు ప్రమాదంపై కేసు నమోదు అయింది. నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌1 ఎస్‌2 ఎస్‌3 బోగీలు పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారులు వివరించారు. 


మరోవైపు ఈ  రైలు ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వేశాఖ కూడా విచారణకు ఆదేశించింది. విచారణ కమిటీ సభ్యులు పైలట్‌ను విచారించారు. ఈ ప్రమాదంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. ఓవర్ స్పీడ్‌ కారణంగానే డెడ్ ఎండ్ గోడను ట్రైన్ ఢీ కొట్టినట్టు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి నాంపల్లి వచ్చిన తర్వాత ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. చాలా మంది ప్యాసింజర్లు సికింద్రాబాద్‌లొనే దిగిపోయారని వివరించారు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లికి వచ్చారని తెలిపారు. ఈ కారణంగానే పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. 


మూడు బోగీల్లో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయని అధికారులు వివరించారు. వారిని లాలాగూడ రైల్వే ఆసుపత్రికి తరలించామని ప్రకటించారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని వారంతా క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.