Chanchalguda feel the jail experience: నగరంలోని చారిత్రాత్మక చంచల్గూడ కారాగారం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. జైళ్ల శాఖ సంస్కరణల్లో భాగంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక జైల్ మ్యూజియం ను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. బ్రిటీష్ కాలం నాటి కారాగారాల చరిత్రను, ఖైదీల జీవన విధానాన్ని , జైళ్ల శాఖ సాధించిన ప్రగతిని కళ్లకు కట్టేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. పాత జైలు ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం సందర్శకులకు ఒక వినూత్న ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది.
ఫీల్ ది జైల్ కాన్సెప్ట్
ఈ మ్యూజియం ప్రత్యేకతలలో అత్యంత ఆకర్షణీయమైనది ఫీల్ ది జైల్ (Feel the Jail) కార్యక్రమం. సాధారణ ప్రజలు ఒక రోజు పాటు ఖైదీ జీవితాన్ని స్వయంగా అనుభవించే అవకాశాన్ని ఇక్కడ కల్పించారు. నిర్ణీత రుసుము చెల్లించి, ఒక రోజంతా ఖైదీలాగే జైలు జీవితం గడపవచ్చు. ఖైదీలకు ఇచ్చే అల్యూమినియం పాత్రలు, దుస్తులు, వారు తినే ఆహారాన్నే సందర్శకులకు కూడా అందిస్తారు. నేరాల పట్ల అవగాహన కల్పించడం, జైలు జీవితం ఎంత కష్టతరంగా ఉంటుందో సామాన్యులకు వివరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
కారాగారాల చరిత్ర ప్రతిబింబించేలా..
మ్యూజియంలో నిజాం కాలం మరియు బ్రిటీష్ కాలం నాటి శిక్షా పద్ధతులు, అప్పట్లో ఉపయోగించిన బేడీలు, ఆయుధాలు, పురాతన రికార్డులను ప్రదర్శనకు ఉంచారు. ఖైదీలు తయారు చేసిన రకరకాల హస్తకళలు, నేత వస్త్రాలు , పెయింటింగ్స్ వారిలో వస్తున్న మార్పులకు నిదర్శనంగా నిలిచాయి. నేరస్తులను సంస్కరించడమే లక్ష్యంగా జైళ్ల శాఖ చేపడుతున్న వివిధ వృత్తి విద్యా కోర్సుల వివరాలను కూడా ఇక్కడ పొందుపరిచారు.
గవర్నర్ ప్రశంసలు
మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చంచల్గూడ జైలును ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే కాకుండా, సామాజిక బాధ్యతను పెంచే విధంగా ఈ మ్యూజియాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఫీల్ ది జైల్ వంటి వినూత్న ఆలోచనలు యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయని, చట్టాన్ని గౌరవించేలా ప్రోత్సహిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మ్యూజియం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. జైలు అనుభవాన్ని పొందాలనుకునే వారు ముందుగా ఆన్లైన్ ద్వారా, జైలు కౌంటర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నగరవాసులతో పాటు పర్యాటకులకు కూడా ఇది ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
