Telangana Crime News: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం కొనసాగుతుండగానే మరో సెన్సేషనల్‌ కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మాజీ సీఎస్‌ పేరు వినిపిస్తుడంతో ఇంకా ఇది ఏ దరికి చేరుతుందో అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు కేసు రిజిస్టర్ చేయడం కీలక మలుపుగా చెప్పుకోవచ్చు 


తెలంగాణలో కమర్షియల్ ట్యాక్స్ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్ చెల్లింపులో అక్రమాలు జరిగాయని గుర్తించిన అధికారులు కేసు నమోదుచేశారు. ఈ కుంభకోణంలో మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌తోపాటు పలువురు కీలక పాత్ర పోషించారని కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో వంద కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు భావిస్తున్నారు. దాదాపు 75 కంపెనీలు ఇందులో భాగమై ఉన్నట్టు తేల్చారు. 


సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి కుంభకోణానికి పాల్పడినట్టు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో తేలింది. ఇందులో తెలంగాణల బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉందని సమాచారం.  ఇందతా అప్పట్లో సీఎస్‌గా ఉన్న సోమేష్‌కుమార్ సూచనలతోనే ట్యాక్స్ పేమెంట్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు ఇతర చర‌్యలు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ఈ కేసులో సోమేష్‌కుమార్‌తోపాటు ఐఐటీ హైదరాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌బాబు, కమర్షియల్ ట్యాక్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, పిలాంటో టెక్నాలజీస్‌పై కేసు నమోదు చేశారు. అధికారులు ఫిర్యాదు మేరకు కుంభకోణానికి పాల్పడిన వారిపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు.