హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాన్ని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ముట్టడించారు. వారు తమకు క్యాబ్, మోటారు రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్ బ్యాడ్జిని రెన్యువల్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.


అసంఘటిత రంగంలో పని చేస్తున్న తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని క్యాబ్, ఆటో యూనియన్ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇందుకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్ యూనియన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్లు నిరసన చేస్తున్న క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.


శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమను అరెస్టు చేయడం ఏంటని క్యాబ్ యూనియన్ నేతలు ప్రశ్నించారు. కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, డ్రైవర్ బ్యాడ్జీ రెన్యూవల్ పెనాల్టీ ఎత్తివేత, పార్కింగ్ స్థలాల కేటాయింపు తదితర డిమాండ్లతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు.


డిమాండ్లు ఇవీ


* క్యాట్, మోటార్ రంగ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.


* పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా, క్యాబ్ కిలో మీటర్ ధరలను నిర్ణయించాలి.


* యాక్సిడెంట్ భీమా రూ.5,00,000 నుంచి రూ.10,00,000 లకు పెంచాలి.


* సాధారణ మరణాలకు, అంగవైకల్యానికి వర్తింపజేయాలి.


* బ్యాడ్జి రెన్యువల్ పెనాల్టీలు ఎత్తివేయాలి, మేళాలు పెట్టి కొత్త బ్యాడ్జీలు ఇవ్వాలి.
పెంచిన గ్రీన్ టాక్స్, క్వార్టర్లీ టాక్స్ ను తగ్గించాలి.


* క్యాబ్ లకు గ్రేటర్ హైదరాబాద్ లో తగినన్ని పార్కింగ్ స్థలాలు కేటాయించాలి


* బ్యాడ్జీలు కలిగిన డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి


* హైర్ వెహికిల్ ధరలు పెంచాలి, బకాయిలు చెల్లించాలి.