Revanth in National Herald case: కాంగ్రెస్ను చికాకు పెడుతున్న కేసుల్లో నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి. ఇందులో నిందితులుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా భాగం ఉందని ఈడీ పేర్కొనడంతో సంచలనంగా మారుతోంది. దీంతో ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో గత నెలలోనే ఈడీ ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించింది. ఇందులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు ఐదుగుర్ని నిందితులుగా చేర్చింది. కానీ ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పవన్ బన్సల్, చనిపోయిన నేత అహ్మద్ పటేల్ పేర్లు రావడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు చేసి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులు కొట్టేయడానికి యత్నించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ఆస్తుల విలువ దాదాపు రెండు వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటులో చాలా మంది కాంగ్రెస్ నేతలు భాగమయ్యారని 2019-22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేశారని పేర్కొంది ఈడీ. పదవులు, ఇతర ప్రయోజనాలు ఎర చూపించి డబ్బులు వసూలు చేసినట్టు పేర్కొంది. అందులో అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ భాగమయ్యారని తెలిపింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ విషయాన్ని ఛార్జిషీట్లో పెట్టినట్టు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో విచారణలో భాగంగా గతంలో సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ను కూడా ఈడీ విచారించింది.
అవినీతి బండారం వెలుగులోకి: కేటీార్
ఇప్పుడు ఈడీ ఛార్జ్షీట్ను అస్త్రంగా మార్చుకుంటోంది బీఆర్ఎస్. ఈ విషయంపై కేటీర్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి అవినీతి ఈడీ కేసుతో తేటతెల్లమైందని పేర్కొన్నారు." యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టినట్టు ఈడీ నమోదు చేసిన చార్జిషీట్తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది.
అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టైంది. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా ? లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా ??" అని అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైందన్నారు కేటీఆర్. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోందని విమర్శించారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టేనని అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినట్టు అయిందన్నారు కేటీఆర్. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయని తెలిపారు. 30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు కేటీఆర్. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది... చివరికి ధర్మం గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.