BRS Working President KTR at Telangana Bhavan, Hyderabad: 
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ 24 గంటలు కరెంట్ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మనం 48 గంటలు కరెంట్ ఇస్తామని చెబుతాం అంటున్నారని సెటైర్లు వేశారు. 


తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) భారత్ లో విలీనం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ అధికారికంగా త్రివర్ణ పతాకం ఎగురవేశారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మత విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మతం పేరిట చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాచుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ, బీజేపీ గత 9 ఏళ్లకు పైగా దేశంతో పాటు తెలంగాణకు ఎంతో అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే నిరంకుశ ఆలోచన విధానంతోనే భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన 7 మండలాలను ఏపీలో కలిపి అన్యాయం చేశారన్నారు.


కరెంట్ సమస్యలు ఉంటే, సీలేరును తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చింది మోదీ సర్కార్. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీని నెరవేర్చలేదని, నీటి వాటాలు తేల్చలేదు. విద్యుత్ సమస్యలు, పరిశ్రమల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇల్లెందులో బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీకి నీళ్లొదిలారని గుర్తుచేశారు. మీరు జన్ ధన్ ఖాతాలు తెరవండి.. విదేశాల్లో కుబేరులు దాచుకున్న నల్లధనాన్ని దేశానికి తీసుకొచ్చి.. రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తారంటూ ప్రధాని మోదీ గొప్ప గొప్ప మాటలు, డైలాగ్స్ చెప్పారంటూ ఎద్దేవా చేశారు. కానీ ఎన్నికల హామీల్లో చెప్పకుకున్నా కేసీఆర్ రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు జమ చేశారు. 


ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు, అంటే 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగులు ఇవ్వడం దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను పోగొట్టారని విమర్శించారు. కేవలం తన స్నేహితుడికి కంపెనీలు, ప్రాజెక్టులు కట్టబెట్టి ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడ ఉపవాస దీక్షలు చేపట్టడం కాదని, ఢిల్లీకి వెళ్లి మోదీతో పోరాటం చేసి తెలంగాణకు నిధులు తీసుకురావాలని సూచించారు. 
యూపీఏ హయాంలో 400 ఉన్న సిలిండర్ ధరలను రూ.1200 చేసిన ఘనత మోదీకి దక్కిందన్నారు. సిలిండర్ ధర రూ.400 కావడానికి ఆనాడు మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని లెక్కలేనని తిట్లు తిట్టారు మోదీ, కానీ నేడు అంతకు మూడింతలు చేసిన మోదీని ప్రజలు ఏమనాలో చెప్పాలన్నారు. డాలర్ కు రూపాయి విలువ క్షీణిస్తుందని ఆనాడు లొల్లి లొల్లి చేసిన మోదీ, బీజేపీలు నేడు అంతకుమించి క్షీణించినా నోరు మెదపకుండా కూర్చున్నారంటూ మండిపడ్డారు. గూడురు నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఏదో సినిమా తీసి సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. చేతకానితనం వల్లే అభివృద్ధి చేయలేక మత విధ్వేషాలతో పబ్బం గడుపుతున్నారు. బుల్లెట్ రైలన్నారు, ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానంలో ఉంటామని చెప్పారు. కానీ ఏదీ సాధ్యం కాలేదన్నారు. 


కాంగ్రెస్ నేడు ఒక్క ఛాన్స్ అడుతుంది, కానీ గతంలో 11 సార్లు ప్రజలు మీకు ఛాన్సిచ్చారు. అప్పుడు ఎందుకు కరెంట్, సాగు, తాగునీరు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం ఒక్కసారి ఛాన్స్ ఇస్తే అన్నీ చేసేస్తామని చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో 600 పింఛన్ ఉంటే, ఇప్పుడు చాన్స్ ఇస్తే రూ.4000 ఇస్తామని చెబుతున్నారు. గతంలో రూ.200 ఇవ్వలేనొళ్లు ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపారంటూ మండిపడ్డారు.


పెద్దావిడ కుడుతుంటే సూది పడిపోయింది. అప్పుడు కంటి వెలుగు లేదు కదా, ఆమెకు సూది దొరకలేదు. దాంతో పక్కకు చూస్తే భద్రాద్రి రాముడు కనిపించాడు. దేవుడా నాకు సూది దొరికేలా చేస్తే 5 కిలోల చక్కెర, బెల్లం ఇస్తానని అత్త అన్నది. ఇది విన్న కోడలు ఇంట్లోంచి బయటకు వచ్చి అయ్యో 50 పైసల సూది కోసం ఎంత పనిచేశావు అత్తా అని అడిగింది. ఆ సూది దొరికేదుందా, నేను దేవుడికి చేసేది ఉందా అని అన్నదని కేటీఆర్ అనగానే చప్పట్లతో మార్మోగిపోయింది. 


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 ఏళ్లకు 5 మంది సీఎంలు వస్తారు, పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ సంకనాకి పోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల విలువ లెక్కిస్తే రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉందని ప్రజలు చెబుతున్నారని గుర్తుచేశారు. రెండు నెలల కిందట కర్ణాటకలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అక్కడ ఎస్సీ, ఎస్టీల కు ఇవ్వాల్సిన నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఇప్పటికే కర్ణాటకలో పవర్ హాలిడే మొదలైందని డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పారని తెలిపారు. వీటికి అదనంగా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పారు.  తలసరి ఆదాయంలో దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది తెలంగాణ. దేశంలో ఇంటింటికి నల్లా పెట్టిన ప్రభుత్వం తెలంగాణ సర్కార్. పర్యావరణం, పట్టణ అభివృద్ధి, ఐటీ సెక్టార్, బెస్ట్ మునిసిపాలిటిలలో జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టింది తెలంగాణ అని చెప్పారు. 


రోడ్డు వేస్తామనో, జిల్లాకో మెడికల్ కాలేజీ ఇస్తామనో అభివృద్ధికి సంబంధించి ఒక్కటంటే ఒక్క హామీ ఇవ్వలేదంటూ కాంగ్రెస్ 6 గ్యారంటీలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ రూ.2000 ఇస్తే, మేం రూ.4000 అని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు చర్చ పెట్టుకోగా.. బీఆర్ఎస్ 24 గంటలు కరెంట్ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేచి మనం 48 గంటలు కరెంట్ ఇస్తామని చెబుతాం అంటున్నారని సెటైర్లు వేశారు. కరెంట్, నీళ్లు ఇలా ఏ బాధల్లేవని.. ఆ గట్టునుంటారా, ఈ గట్టుకొస్తారా మీరే అర్థం చేసుకోవాలన్నారు. ఓటుకు 2, 3 వేలు ఇస్తే ఖమ్మంలో గెలిచేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ డబ్బులు ఇస్తే కచ్చితంగా తీసుకోండి, ఓటు మాత్రం అభివృద్ధి చేసిన వాళ్లకే వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.