ప్రపంచ వ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై పలు రకాలుగా దాడులు జరుగుతున్నాయని, వాటిని తట్టుకుని నిలబడుతున్న ప్రతి జర్నలిస్ట్ మనకు స్ఫూర్తి, వారికి నా సెల్యూట్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తాను అన్ని పార్టీలలోని మహిళా నాయకురాళ్లతో స్నేహం చేయడాన్ని ఇష్టపడతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. 


ఎమ్మెల్సీ కవిత ఆవేదన 
మీడియా స్పియర్ పేరుతో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి మాస్ కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మహిళా జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగాయన్న ఎమ్మెల్సీ కవిత.. మహిళా జర్నలిస్టులను టార్గెట్ చేయడం అందరికీ సులభంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల దేశంలోని అనేక మందిపై పెగాసస్ ఉపయోగించారని, అందులో ఎక్కువ మంది మహిళా జర్నలిస్టులే ఉన్నారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.


కుటుంబ సభ్యులే పరువు హత్యలు చేస్తున్నారు 
పాకిస్తాన్ లాంటి దేశాలలో మహిళా జర్నలిస్టులు వార్తలు రాసినందుకు ‌కుటుంబ సభ్యులే పరువు హత్యలు చేసిన ‌సందర్భాలు‌ ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జర్నలిజం మహిళలకు అనుకున్నంత సులభమైన వృత్తి కాదని, అయితే చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రంగం ద్వారా అనేకమంది ‌మహిళలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. స్వార్థంతో కాకుండా, సమాజం కోసం చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేసినప్పుడే సవాళ్లను ఎదుర్కోగలమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తాను అన్ని పార్టీలలోని  మహిళా నాయకురాళ్లతో స్నేహం చేయడాన్ని ఇష్టపడతానని, మహిళా జర్నలిస్టులు కూడా ప్రపంచంలోని వివిధ రకాల సంస్థలతో సంబంధాలు కలిగి ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. 


మహిళలంతా స్వతహాగా నిర్ణయాలు ‌తీసుకొని ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలో మహిళలు ఇవే ధరించాలి, ఇలాగే మాట్లాడాలి అని చెప్పే దుష్టుల మాటలు పట్టించుకోవద్దన్న కవిత, సరైన నిర్ణయాలు తీసుకొని ఉన్నత స్థానాలను ‌చేరుకోవాలన్నారు. ఈ ఏడాది నుండి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో అర్థికంగా వెనుకబడిన పది మంది విద్యార్థినిలకు భారత్ జాగృతి తరుపున 'కేసీఆర్ స్కాలర్‌షిప్' అందిస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బతుకమ్మ, భారతదేశం, ఓటు హక్కు అంశాలపై మూడు సినిమాలు రూపొందించాలని విద్యార్థులను ఎమ్మెల్సీ కవిత కోరారు.