Hyderabad News: తెలంగాణలో రాజకీయా మరోసారి హీటెక్కే న్యూస్ ఇది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న టీడీపీని పరుగులు పెట్టించే చర్యలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణలో చురుగ్గా ఉన్న నేతలు సమావేశమవుతున్నారు. చాలా రోజుల క్రితం బాబూ మోహన్ లాంటి వాళ్లు సమావేశమయ్యారు. ఇప్పుడు మరికొందరు హైదరాబాద్ నేతలు భేటీ కావడంతో ఆసక్తి నెలకొంది. 


ఈ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. మరో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకకు చంద్రబాబును ఆహ్వానించేందుకే తాను సమావేశమైనట్టు మల్లారెడ్డి ప్రకటించారు. అంతకు మించి ప్రాధాన్యత లేదని అన్నారు. 


తాను మాత్రం టీడీపీలో చేరుతానని ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి. త్వరలోనే మంచి రోజు చూసుకొని చేరుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా టీడీపీ పాలన రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అప్పుడు ఎన్టీఆర్ హయాంలో ప్రజలకు పాలన ఫలాలు లభించాయని తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కారణంగా హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు. అందుకు తానే సాక్ష్యమని అన్నారు. 


తెలంగాణలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన ప్రణాళిలు సిద్ధంగా ఉన్నాయన్నారు తీగల కృష్ణారెడ్డి. దీనిపై చర్చించేందుకే చంద్రబాబు సమావేశమైనట్టు చెప్పుకొచ్చారు. అయితే వేరే పనుల్లో బిజిగా ఉన్న చంద్రబాబు వీటి గురించి తర్వాత మాట్లాడదామంటూ చెప్పారన్నారు. ఇన్ని రోజులు గుర్తింపు కలిగిన పెద్ద లీడర్ ఎవరూ లేకుండా ఉన్న టీడీపీకి తీగల పెద్దదిక్కు కానున్నారనే చర్చ నడుస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఇంత వరకు ఫిల్ చేయలేకపోయింది అధినాయకత్వం. వరుస ఎన్నికల కారణంగా దీనిపై నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నా... అందుకు తగ్గ లీడర్ లేరనే వాదన కూడా ఉంది. 


ఇప్పుడు టీడీపీలో చేరేందుకు కీలకమైన నేతలు అంగీకరం తెలుపుతున్న వేళ  పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగాలి తెలంగాణ నేతలు సూచిస్తున్నారు. పార్టీకి ఎవరు ఎంత వరకు అవసరమో గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మరోసారి వలస నేతలను నమ్ముకుంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. 


తీగల కృష్ణా రెడ్డి రాజకీయ జీవితం టీడీపీ నుంచే ప్రారంభమైంది. హైదరాబాద్‌ మేయర్‌గా పని చేసి అభివృద్ధిలో భాగమయ్యారు. 2002 నుంచి 2007 వరకు ఆ పదవిలో ఉన్నారు. అదే అనుభవంతో 2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కూడా అదే నియోజవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యేందుకుగ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. 


Also Read:ఉపయోగించని క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలా, కంటిన్యూ చేయాలా - ఏది మంచిది?