Telangana Latest News: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే కారు దిగిన వాళ్లంతా ఇప్పుడు మడమ తిప్పుతున్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఎప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందో అన్న భయం వారిలో ఉంది. దీంతో కాంగ్రెస్‌లో చేరలేదంటూ కొత్త స్వరం అందుకుంటున్నారు. 

గతేడాది బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసి చాలా మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు జై కొట్టారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇంకా చాలా మంది బీఆర్‌ఎస్ వీడబోతున్నారని స్టేట్మెంట్‌లు కూడా ఇచ్చారు. వాళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నామని చెబుతున్నారు. తాము పార్టీ మారలేదని అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. 

Also Read: 3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్

తన అనుమతి లేకుండా ఫొటోలు వాడుతున్నారని ఫిర్యాదు

ఇలా చెబుతున్న వారిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒకరు. ఆయన ఏకంగా కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టారు. తన అనుమతి లేకుండా కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో తన ఫొటో వేసుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన రాజకీయ జీవితాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే తన ఫొటోను కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో వేస్తున్నారని పదిహేను రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. 

సుప్రీం కోర్టు దూకుడుతో ప్రత్యామ్నాయ ఆలోచనల్లో ఎమ్మెల్యేలు! 

ఆ ఫిర్యాదు తాజాగా వెలుగు చూసింది. దాన్ని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి కండువాలు కప్పుకొని ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనకు సుప్రీంకోర్టులో నడుస్తున్నా కేసే అంటున్నారు విశ్లేషకులు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌పై ఒత్తిడి వస్తోంది. అటు సుప్రీంకోర్టుకు కూడా సీరియస్‌గా ఉంది. అందుకే మధ్య మార్గంగా బీఆర్‌ఎస్ రెబల్ ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారని శ్రేణులు అంటున్నాయి.  

సుప్రీంకోర్టులో నడుస్తున్న ఎమ్మెల్యే అనర్హత వేటు కేసు 

కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో సమానవేశమయ్యారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు కండువాలు కూడా కప్పుకున్నారు. అక్కడ కొన్ని పదవులు కూడా తీసుకున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీఆర్‌ఎస్‌ కోర్టులను ఆశ్రయించింది. పార్టీఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారని ముందుహైకోర్టులో కేసు వేసింది. అక్కడ వ్యతిరేక తీర్పు రావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కేసు నడుస్తోంది. దీనిపై సమాధానం చెప్పాలని కోర్టు పుల మార్లు స్పీకర్ కార్యాలయంపై ఒత్తిడి తీసుకొస్తోంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఆ సరైన టైం అంటే ఎప్పుడో చెప్పాలని కూడా నిలదీసింది. 

మరోవైపు పార్టీ ఫిర్యాయించిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా వేటు పడుతుందని తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ప్రతి లీడర్ చెబుతున్నారు. అందులో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని కూడా ధీమాతో ఉన్నారు. 

Also Read: PMకు తెలంగాణ CM ఏం వినతులు చేశారు? రేవంత్‌కు మోదీ చేసిన సూచన ఏంటి?