BRS MLAs Kaushik Reddy and Arikepudi Gandhi : తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, పీఏసీ పదవి పెద్ద చిచ్చు పెట్టింది. బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతిసవాళ్లతో హైదరాబాద్‌ హీటెక్కింది. ఇది ఇవాళ కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. నేడు కూడా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో ఈ ఎపిసోడ్‌కు ఇప్పట్లో తెరపడే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది. ఇంకోవైపు శేరిలింగంపల్లి నేతలంతా గాంధీ నివాసంలో సమావేశం కావడం హీట్ పెంచుతోంది. 


నేడు గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డి


గురువారం జరిగిన ఘటనలకు కచ్చితంగా ప్రతిఘటన ఉంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఉదయం 11 గంటలకు వందలాది మందితో గాంధీ ఇంటిని ముట్టడించి తీరుతామని అన్నారు. గాంధీని ఆహ్వానించి తన ఇంట్లో భోజనం పెట్టి పంపిద్దామని అనుకుంటే రౌడీ షీటర్లతో వచ్చి తనను హతమార్చేందుకు యత్నించారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. ఎమ్మెల్యేకే రక్షణ లేక పోతే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. గాంధీ టీడీపీని మోసం చేసి బీఆర్‌ఎస్‌లో... అక్కడ వారిని మోసం చేసి కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన ఆ వ్యక్తి తెలంగాణపై పెత్తనం చెలాయిస్తామంటే కుదరదని అన్నారు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటున్న గాంధీ ఇంటికి కార్యకర్తలతో వెళ్లి అక్కడే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసి తర్వాత తెలంగాణ భవన్‌కు వస్తామన్నారు కౌశిక్ రెడ్డి. 


Also Read: బీఆర్ఎస్ నేతల అరెస్ట్, హరీశ్ చేతికి గాయం! రెండు గంటలుగా రోడ్లపైనే తిప్పుతున్న పోలీసులు


గాంధీ నివాసంలో కీలక సమావేశం


మరోవైపు అరికెపూడి గాంధీ ఇంట్లో శెరిలింగంపల్లి బీఆర్‌ఎస్ నేతలు సమావేశమవుతున్నారు. మేడ్చల్‌ జిల్లా నేతలంతా వచ్చి భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి కౌశిక్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నందున మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. 


గురువారం హైడ్రామా


శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించడంతో లొల్లి మొదలైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన పదవిని కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎలా ఇస్తారని అపొజిషన్ పార్టీ నిలదీస్తోంది. దీనిపైనే ప్రెస్‌మీట్ పెట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు సిగ్గు శరం లేదని అందుకే చీర కట్టుకొని గాజులు తొడుక్కొని ప్రజల మధ్య తిరగాలని డిమాండ్ చేశారు. అసరమైతే వాటిని తామే పంపిస్తామంటూ మీడియాకు చూపించారు. 


Also Read: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు


ఛాలెంజ్‌లతో టెన్షన్ 


కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పుకోవడం దారుణంగా ఉందని విమర్శించారు. అలా అయితే రోజూ తెలంగాణ భవన్‌కు రావాలని అన్నారు. లేదంటే తానే గాంధీ ఇంటికి వెళ్లి తెలంగాణ భవన్‌కు తీసుకొచ్చి ప్రెస్మీట్ పెడతానంటూ సవాల్ చేశారు. డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ చేశారు. 


గురువారం ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయన ఇంటిపై బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తానన్న కౌశిక్ రెడ్డి సవాల్‌ను గాంధీ కూడా స్వీకరించారు. నువ్వో నేనో తేల్చుకుందాం రావాలని కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ చేశారు. పోలీసుల పేరు చెప్పి రాలేకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇరువురు నేతల ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. 


ఇలా బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరి నేతల మధ్య ఛాలెంజ్‌లతో హైదరాబాద్‌ పొలిటికల్‌ సెంటర్ హీటెక్కింది. గురువారం నాడు రోజంతా హైడ్రామా నడిచింది. ఇరువురు నేతలను బయటకు రాకుండా తీవ్రంగా కట్టడి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పోలీలు వలయాన్ని ఛేదించుకొని బయటకు వచ్చిన గాంధీ... కొండాపూర్‌లోని కొల్లా విల్లాస్‌లో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ భద్రత ఉన్నప్పటికీ అవేమీ ఆయన అనుచరులు పట్టించుకోలేదు. గేటు విరగ్గొట్టి, తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అటు నుంచి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా ప్రతిఘటించారు. ఇలా ఇరు వర్గాల మధ్య యుద్ధవాతావరణం నడిచింది. అటు నుంచి కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు పడితే ఇటు నుంచి రాళ్ల వాన కురిసింది. చివరకు అరికెపూడి గాంధీని అరెస్టు చేసి తరలించడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. 


అర్థరాత్రి హంగామా


పరిస్థితి కూల్ అయిందనేలోపు బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, కౌశిక్‌ రెడ్డి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు వెళ్లడంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తతు దారి తీసింది.  కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వాళ్లను అరెస్టు చేయాలన్న డిమాండ్‌తో వాళ్లు ఆందోళన చేశారు. ఈ క్రమంంలోనే పోలీసులకు కౌశిక్‌ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జరిగిన దాడిపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ ఇచ్చే వరకు తాము కదిలేది లేదని రాత్రి ఏడు గంటల వరకు అక్కడే బైఠాయించారు. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి సిటీ బయట విడిచిపెట్టారు. 


బీఆర్‌ఎస్‌ నేతలను నాటకీయపరిణామాల మధ్య తరలించారు. మొదట తలకొండపల్లికి అక్కడి నుంచి కేశంపేట పీఎస్‌కు తరలించారు. అక్కడ కాసేపు తోపులాట జరిగింది. డీజీపీ కలుగుచేసుకొని కేసులు పెట్టేందుకు అంగీకరించారని అందుకే శాంతించినట్టు బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. తర్వాత కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులపై 189, 191(2), 191(3). 61, 132, 329, 111, 324(4), 324(5), 351(2), ఆర్‌-డబ్ల్యూ 190 డీఎన్‌ఎ్‌స సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఏ1గా అరికెపూడి గాంధీని చేర్చారు.