Brahmana Chaitanya Vedika condemns Venu Swamy: గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బ్రాహ్మణ కులంలో ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి, అతని భార్య శ్రీవాణి బ్రాహ్మణ కులం మద్దతు తమకు ఇవ్వాలని కోరుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఒక న్యూస్ ఛానల్ కు వేణు స్వామి కుటుంబానికి జరుగుతున్న వివాదంలో ఒక వీడియో రిలీజ్ చేసి బ్రాహ్మణ సంఘాలు మద్దతు కోరడం జరిగిందని అన్నారు. అయితే తప్పుడు పనులు, మోసపు పనులు చేస్తూ వేణు స్వామి కుటుంబం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపేలా ఉన్నారని.. అలాంటివారు బ్రాహ్మణ జాతి మద్దతు అడగటం ఎంతవరకు సబబు అని  ప్రశ్నించారు.


వేణు స్వామిది బ్రాహ్మణ కులం కాదు
అసలు వేణు స్వామి బ్రాహ్మణ జాతిలో జన్మించలేదని తన కులం బహిరంగంగా చెప్పుకుంటానికి సిగ్గుపడే వేణు స్వామి.. ఈ రోజున బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయలను అవమానిస్తున్నారని అన్నారు. ‘‘ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణ సమాజం మనోభావాలను దెబ్బతీశాడు, బ్రాహ్మణ కట్టు, బొట్టుతో సినీ ఇండస్ట్రీ వారిని, రాజకీయ నాయకుల్ని, మీడియా చానల్స్ వారిని, ప్రజలను మోసం చేస్తూ సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తున్నాడు. ఇతను బ్రాహ్మణుల కులంలో ఉన్న ఏ శాఖకు కూడా సంబంధించిన వాడు కాదు. చివరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన చాత్తాద శ్రీ వైష్ణవుల కులానికి సంబంధించిన వాడని మా విచారణలో తేలింది. 


అతను ఏ కులానికి చెందిన వ్యక్తినో బహిరంగంగా ప్రజల ముందు తెలియజేయాలి. లేని పక్షంలో బ్రాహ్మణ వేషధారణ తీసివేయాలి. లేకపోతే అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. వామాచార పద్ధతుల్లో యోని పూజల పేరుతో మహిళలను, చిన్నపిల్లల్ని హోమాల దగ్గర, అలానే జీవ బలుల కార్యక్రమాల పేరుతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం పేరుతో తప్పుడు జ్యోతిష్యాలు చెబుతూ సమస్యల మీద వచ్చిన వారిని భయపెడుతూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాడు. జ్యోతిష్యం పేరుతో లక్ష రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాడు. అతనికేమీ జ్యోతిష్యం రాదు.. అంతా మోసం. వేణు స్వామిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎవరు నమ్మవద్దు. అతని మోసాలకు గురి కావద్దు’’ అని శ్రీధర్ పిలుపునిచ్చారు. 


డ్రగ్స్ దందాపై అనుమానాలు
తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం పేరుతో ఆర్థికంగా, సామాజికంగా నష్టపోయిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని, వేణు స్వామి ఒక మత్తు పదార్థాల బ్రోకర్ గా చలామణి అవుతున్నాడేమోనని మాకు అనుమానం ఉన్నట్లు శ్రీధర్ తెలియజేశారు. అలానే తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జా చేసాడని తన పేరిట రిజిస్టర్ కూడా చేయించుకున్నాడని, జ్యోతిష్యం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ, కులాల మధ్య కొట్లాటలు పెట్టి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేణుస్వామిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. 


ఈ సందర్భంగా బ్రాహ్మణ కులంలో ఉన్న వివిధ శాఖల సంఘ నాయకులైన జాతీయ వేద స్మార్త ఆగమ సంఘం కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ.. తమ వైదిక శాఖలో ఎవరితో బంధుత్వం కూడా లేదని తాము ఇటువంటి వామాచార పద్ధతులకు వ్యతిరేకమని ప్రస్తుతం సమాజంలో అవి నిరుపయోగమైనవని అన్నారు. ఎప్పటికైనా సరే వేణు స్వామి జ్యోతిష్యం పేరుతో తన మోసాలను కట్టి పెట్టాలని శాస్త్రి తెలియజేశారు. 


వైఖానస శాఖకు చెందిన రాష్ట్ర నాయకులు వేదాంతం వెంకట హరనాథ్, ఆరువేల నియోగుల శాఖ అధ్యక్షులు వడ్లమూడి రాజా, ఆంధ్ర రాష్ట్రీయ శివార్చక సంఘ నాయకులు ప్రత్తిపాటి అనిల్, అర్చక పౌరోహిత్యంలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన చాత్తాద శ్రీవైష్ణవ కులానికి చెందిన ఉమ్మడి రాష్ట్ర సలహాదారు వేల్పురి ప్రసన్న ఆంజనేయులు, శ్రీ వైష్ణవ సంఘ నాయకులు కిడాంబి శ్రీనివాసాచారి, ఎండపల్లి శబరి వడ్డమాను ప్రసాదు, వంగవీటి చైతన్య చిలుమూరు ఫణి, అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.