టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై బీజేవైఎం TSPSC ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు ఈ విషయంపై TSPSC కార్యాలయానికి వచ్చి, ప్రధాన బోర్డును విరగొట్టారు. భారీగా అక్కడికి బీజేవైఎం నాయకులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఎస్పీఎస్సీ గేటు లోపలికి చొచ్చుకెళ్లిన బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.


గ్రూప్ 1 పేపర్ కూడా లీకైనట్లు అనుమానాలు


అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనట్లు తేలడంతో.. టీఎస్‌పీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో కూడా గోల్‌మాల్‌ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రూప్‌-1 పరీక్ష పత్రాలు లీకై ఉండొచ్చని పలువురు అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం టీఎస్‌పీఎస్సీని కుదిపేస్తుండడంతో గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.


గ్రూప్-1 రాసిన ప్రవీణ్


టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏపీ పరీక్ష పేపర్ లీక్ కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా బయటికెళ్లినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసినట్లు తెలిసింది. అతడికి 100 పైగా మార్కులు వచ్చినట్లు తెలుస్తుండగా.. ఆ పేపరును అధికారులు పరిశీలిస్తున్నారు. గతేడాది అక్టోబరు 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 1:50 నిష్పత్తిలో 25,150 మంది మెయిన్స్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే.


అసిస్టెంట్‌ ఇంజినీర్ పరీక్ష రద్దు? ప్రశ్నపత్రాల లీకేజీతో యోచనలో టీఎస్‌పీఎస్సీ!


తెలంగాణలో మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డి.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాన్ని ఇతరులకు ఇచ్చినట్లు తేలడంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు మంగళవారం (మార్చి 14) కమిషన్‌ అత్యవసరంగా సమావేశమై చైర్మన్‌ జనార్దన్‌రెడ్డితోపాటు సభ్యులు చర్చించి, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 


ఇప్పటికే టీపీబీవో, వీఏఎస్ పరీక్షలు వాయిదా..
పేపరు లీకేజీ వార్తల కారణంగా ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ మార్చి 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ (టీపీబీవో); అలాగే మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్టు కమిషన్‌ ప్రకటించింది. అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేసింది. కమిషన్ కార్యాలయంలో సిస్టమ్‌ను ఎవరో ఓపెన్‌ చేశారనే సమాచారం వచ్చిన వెంటనే పోలీస్‌స్టేషన్‌లో కమిషన్‌ ఫిర్యాదు చేసింది. మరుసటిరోజే జరగాల్సిన పరీక్షతోపాటు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలను సైతం ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రద్దు చేసిన పరీక్షలను ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహించాలని కమిషన్‌ భావిస్తున్నది. మంగళవారం జరిగే భేటీలో తదుపరి తేదీలను ఖరారు చేసి.. తేదీల ప్రకటనపై నిర్ణయానికి రానున్నారు.