Telangana News: తెలంగాణ ఉద్యమ నౌక గద్దర్‌ కేంద్రంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల దాడి కొనసాగుతోంది. పద్మ అవార్డుల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కౌంటర్ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు వారి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. గద్దర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  


గద్దర్‌ను ఎల్టీటీఈ తీవ్రవాదితో పోల్చారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. దేశానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తికి ఎలా అవార్డు అడుగుతారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ఈ డిమాండ్ చేస్తున్నారని నిలదీశారు. ప్రజల ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్ అంటూ సంచలన వ్యాక్యలు చేశారు. నిషేధిత మావోయిస్టు సంస్థలో పని చేసిన వ్యక్తికి అవార్డు ఇస్తారా అని విస్మయం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎల్టీటీఈకి కూడా పద్మ అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించారు. గద్దర్ కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నందుకు అవార్డు ఇవ్వాలా అని నిలదీశారు. ఇప్పటికి కూడా ఆయనపై కేసులు ఉన్నాయని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు.  


పద్మ పురస్కారాలపై రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా స్పందించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ అవార్డులు రావన్న ఆయన... అందుకు కొన్ని అర్హతలు ఉంటాయని గుర్తు చేశారు. ఏ స్థఆయి లేని గద్దర్‌ లాంటి వ్యక్తులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన ఆయనకు అవార్డు ఇస్తే ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. తమ కార్యకర్తలను చంపిన వ్యక్తులపై పాటలు పాడారని అలాంటి వ్యక్తికి బరాబర్‌ అవార్డు ఇవ్వబోమని స్పష్టం చేశారు. 


Also Read: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు


బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గద్దర్‌ను అవమానిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను జాగృతం చేసిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అంటున్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తిని అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా అని నిలదీస్తున్నారు. నక్సలైట్ భావాజాలం అయితే అవార్డులు ఇవ్వరా అంటు ప్రశ్నిస్తున్నారు. నక్సలైట్‌లకు ఎన్నికల్లో పోటీ చేసే టిక్కెట్‌లు ఇస్తారు కానీ అవార్డులు ఇవ్వారా అని ఫైర్ అయ్యారు. 


2025 సంవత్సరానికి పద్మ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదిత పేర్లు ఇవే. అందెశ్రీ (ప‌ద్మభూష‌ణ్‌), చుక్కా రామ‌య్య (ప‌ద్మభూష‌ణ్‌), గ‌ద్దర్ (ప‌ద్మవిభూష‌ణ్‌), గోర‌టి వెంక‌న్న (ప‌ద్మశ్రీ‌), జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు (ప‌ద్మశ్రీ‌) పేర్లను కేంద్రానికి తెలంగాణ సిఫార్సు చేసింది. ఈసారి దేశవ్యాప్తంగా 139 మందికి కేంద్రం పద్మ పురస్కారాలు అందజేసింది. ఇందులో రెండు తెలంగాణకు వస్తే ఐదు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి.


Also Read: గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్