Telangana : తెలంగాణలో గత కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని జూన్ 25వ తేదీన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు రాగాన్ని అన్ని పార్టీలు ఆలపిస్తున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీల నుంచి వాడి వేడి వాగ్బాణాలు ప్రత్యర్థి పార్టీలపైకి వదులుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ఆయా పార్టీ నేతలు కౌంటర్ ఎటాక్ చేయడం ప్రారంభించారు. ఇలా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రాజకీయం ఇప్పుడు నడుస్తోంది. అయితే, ఈ అంశంపై ఏ పార్టీ ఏం అంటోంది, ఆ మాటల వెనుక రాజకీయ కోణాలు ఏంటో తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ కథనాన్ని చదవండి.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఏం చేస్తోందంటే?
ఎన్నికల హామీని చిత్తశుద్ధితో నిలబెట్టుకునే దిశగా తమ పార్టీ అడుగులు వేస్తోందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. అందులో భాగంగానే 42 శాతం రిజర్వేషన్లు బీసీ సామాజిక వర్గానికి కల్పిస్తున్నామని చెబుతోంది. ఈ క్రమంలోనే బీసీలకు రిజర్వేషన్ పెంపు కోసం పంచాయతీ రాజ్ సవరణ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా జులై 15వ తేదీ సాయంత్రం ఈ ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ కార్యాలయానికి పంపింది. రేపోమాపో గవర్నర్ పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపవచ్చని, దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయిందని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు.
బీసీ రిజర్వేషన్ల ఘనత మాదే - కాంగ్రెస్
గత శాసన సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదే అవుతుందని అధికార కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని, "మేం అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నామని" సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. "బీసీ రిజర్వేషన్ల అమలుకు మాకు స్పష్టమైన విధానాలు ఉన్నాయి" అన్నారు. "బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడటం మా బాధ్యత" అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు బీసీల విషయంలో తమ ప్రభుత్వం చురుకుగా పని చేస్తోందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదని చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే బీసీలు బాగా నష్టపోయారని గులాబీ పార్టీపై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీని బీసీల పార్టీగా మార్చే వ్యూహంతో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతుంది. బీసీల హక్కులు కాపాడటంలో నెంబర్ వన్ పార్టీ కాంగ్రెస్సే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమం ద్వారా ప్రజలకు చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, సాంకేతిక అంశాలు, న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా తాము బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా ఉన్న భట్టి సైతం కాంగ్రెస్ పార్టీని బీసీల పార్టీగా చెబుతూనే, ప్రతిపక్షాలపైన విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యల ద్వారా బీసీలకు న్యాయం చేసే దిశగా తమ పార్టీ నడుస్తోందని బీసీ సామాజిక వర్గానికి సంకేతాలు పంపారు. అయితే మరో పార్టీ బీజేపీపైన కాంగ్రెస్ నేతలు వాగ్బాణాలు సంధిస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చించి చట్టంగా రూపొందించాలని డిమాండ్ చేస్తోంది. బీసీల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కేంద్రానికి తాము అసెంబ్లీ, క్యాబినెట్ తీర్మానాలు పంపినా ఉలుకు పలుకు లేదని కమలం పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరి ఓ డ్రామా - బీఆర్ఎస్
ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మాత్రం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ చేస్తోంది డ్రామా అని ఎదురు దాడికి దిగుతోంది. కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని గులాబీ నేతలు ప్రతీ వేదిక పై నుంచి హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీల రిజర్వేషన్ల అమలు కోసం ఇందిరా పార్కులో జరిగిన కార్యక్రమంలో గులాబీ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనా చారి మాట్లాడుతూ ఓట్ల కోసమే కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను బీసీల కోసం చేసిందని చెప్పుకొచ్చారు. బీసీ ఓటు గులాబీ పార్టీ వైపు నుంచి చెదరిపోకుండా ఉండేలా వ్యూహాత్మకంగా మధుసూదనా చారి మాట్లాడారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని, ఇలా చేస్తే తెలంగాణలో రాజకీయ భూకంపం తప్పదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. గులాబీ బాస్ కేసీఆర్ కనుసన్నల్లో జరిగిన బీసీ నేతల ధర్నా అటు ప్రభుత్వానికి రాజకీయ హెచ్చరికలు పంపేందుకే అన్న విషయం బోధపడుతోంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శ ఏంటంటే, ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని, ఇదో డ్రామా అని విమర్శ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ప్రధాని వద్దకు అఖిల పక్షం తీసుకెళ్లలేదని ఆరోపణలు చేస్తోంది. పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదించకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేమని, ఇది న్యాయస్థానాల ముందు తేలిపోతుందన్న సాంకేతిక అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది.
బీసీల్లో మతపరమైన రిజర్వేషన్లా? - బీజేపీ
బీజేపీ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. కమలం పార్టీ నేతలు తమదైన లైన్లో హస్తం పార్టీని తప్పుబడుతున్నారు. బీసీ కోటాలో పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఎలా ఇస్తారని ప్రశ్నలను బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్ రావు గత కొద్ది రోజులుగా ఆయా వేదికల నుంచి సంధిస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని తెల్చి చెబుతున్నారు. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని చెబుతూ ఆ పార్టీ అధ్యక్షుడి విమర్శ. అయితే మిగతా కమలం నేతలు కూడా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, మతపరమైన రిజర్వేషన్లకే వ్యతిరేకం అని ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. రిజర్వేషన్ల బిల్లు కేంద్రం బాధ్యత అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, రాష్ట్రాల్లో అమలు చేసుకోవచ్చని అందుకు అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా బీసీల్లో ముస్లింలను చొప్పించి చిచ్చుపెట్టే రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపణ చేయడం ద్వారా మతపరమైన రిజర్వేషన్ల అమలుపై వ్యతిరేకతను బయటపెట్టారు. అంతే కాకుండా బీసీ బిల్లుకు ఆమోదం తెలిపే ప్రక్రియ అంతా రాష్ట్రంలోనే అన్న వ్యాఖ్యల ద్వారా తమపై జరుగుతున్న దాడికి ప్రతిదాడిగా స్పందిస్తూ, కాంగ్రెస్ను బీసీ సామాజిక వర్గంలో దోషిగా నిలబెట్టే ఎదురుదాడి వ్యూహంతో బీజేపీ సాగుతోంది.
ఇలా గత కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో వాడి వేడిని పుట్టిస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఉద్రిక్తతను సృష్టించే అవకాశాలు లేకపోలేదు. అయితే అధికార కాంగ్రెస్ ఈ విషయంలో ఎలాంటి వ్యూహంతో సాగుతుంది, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ దూకుడును అడ్డుకుని బీసీల మద్దతును ఎలా పొందుతారన్నది మాత్రం వేచి చూడాలి.