ఈనెల 25న ఇబ్రహీంపట్నంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మొత్తం 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగినాయ్. దురద్రుష్టవశాత్తు నలుగురు చనిపోయారు. మరో 30 మంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ ఆపరేషన్ (ల్యాప్రోస్కోపిక్) చాలా చిన్నదని.. 5 నిమిషాల్లోపు జరిగే ఆపరేషన్‌కు నలుగురు చనిపోవడంతోపాటు మిగిలిన వారందరికీ ఇన్ఫెక్షన్ కావడం కలచివేసిందని అభిప్రాయపడ్డారు. ఇది చాలా పెద్ద ఘటన దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి ఇదే నిదర్శనం అన్నారు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కేసీఆర్ సర్కార్ చేసిన హత్యలేనని తెలిపారు. 






మత్తు మందు ఇవ్వకుండానే ఆపరేషన్లు..!


ఆసుపత్రికి వెళితే చికిత్స పొందుతున్న బాలింతలు ఏడుస్తున్నారని.. వాళ్లందరికీ చిన్న చిన్న పిల్లలున్నారని తెలిపారు. వాళ్ల భవిష్యత్తు ఏంటో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ‘‘ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇవ్వలేదని.. సర్జరీ చేస్తుంటే చాలా ఏడ్చినట్లు బాధితులు చెబుతున్నారన్నారు. ఆపరేషన్ పూర్తయ్యాక ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నామంటూ కన్నీటి పర్యంతం అయ్యారని బండి సంజయ్ తెలిపారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించడానికి రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఏం ఉద్దరించడానికి బిహార్ వెళ్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి పైసలు తీసుకుపోయి బిహార్‌లో పెడతరా? అని ప్రశ్నించారు. 24 గంటలూ ఎవరి కొంపలు ముంచాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేయడమే తప్ప.. పేదల గురించి ఆలోచనే లేని దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు.


తూతూ మంత్రంగా కమిటీ వేశారు..


హరీష్ రావు అబద్దాల మంత్రి అని.. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే వస్తాయంటూ విమర్శించారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతల పనంతా నిత్యం లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, శ్యాండ్ దందాలేనని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే... ఏదో ఒక కమిటీ వేసి తూతూ మంత్రపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప చేసిందేముందని బండి సంజయ్ ప్రశ్నించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని.. పిల్లలకు విద్యకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.  


సీఎం కేసీఆర్ పేదలను పరామర్శించరు..!


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు బండి సంజయ్. రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు. పేదల ప్రాణాల కంటే కేసీఆర్ సర్కార్ కు పేరు ప్రఖ్యాతలే ముఖ్యం అంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ కు పేదల ఉసురు కచ్చితంగా కొడుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఒప్పుకోమన్నారు. ఎనిమిదేళ్ళ కాలంలో ఒక్క పేద కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించలేదన్నారు. సీఎం కేసీఆర్ మనిషి కాదంటూ దెప్పిపొడిచారు. బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలు చెబుతున్నట్లు ఆయన వివరిచారు. ఈ ఘటనకు బాధ్యుడైన వైద్యశాఖ మంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలన్నారు. హరీష్ రావు కుటుంబ సభ్యుడు కాబట్టే ఆయనపై సీఎం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇంత జరుగుతున్నా బాధితులను పరామర్శించేందుకు ఎందుకు రాలేదో సీఎం సమాధానం చెప్పాలన్నారు.