హైదరాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంది ఎంతో ఉప యుక్తంగా ఉండనుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నేరుగా లండన్‌ను విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని డైరెక్ట్ విమాన సర్వీసులు నడిపే ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. సెప్టెంబరు 9 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వివరించింది. ఈ మేరకు లండన్ నుంచి మొదటి విమానం సెప్టెంబర్ 9న హైదరాబాద్ చేరుకుంటుందని ఎయిర్ ఇండియా సంస్థ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే సమయంలో సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ నుంచి తొలి విమానం లండన్‌కు బయలుదేరనుందని వివరించింది. అయితే, ఈ విమానాలు నాన్‌స్టాప్ అని, ఎక్కడా ఆగబోవని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివరించింది.


ఇప్పటిదాకా ఇలా..


ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు యూకేలోని లండన్‌కు వెళ్లాలంటే కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చేది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కొచ్చి, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, అమృత్‌సర్, గోవా నగరాల నుంచే లండన్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు లండన్ వెళ్లాలంటే ఈ నగరాల్లో ఏదో నగరానికి వెళ్లి అక్కడి నుంచి లండన్ వెళ్లాల్సి వచ్చేది. తాజాగా, ఈ నగరాల జాబితాలో ఇకపై హైదరాబాద్ కూడా చేరింది. 


అయితే, హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు వారానికి కేవలం రెండు సర్వీసులు మాత్రమే ఉండనున్నాయి. అతి పెద్ద విమానం అయిన బోయింగ్ 787 రకానికి చెందిన డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 256 సీట్ల సామర్థ్యంతో వారానికి రెండు సార్లు హైదరాబాద్ టు లండన్ డైరెక్ట్ సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ విమానంలో 18 బిజినెస్‌ క్లాసులు, 238 ఎకానమీ క్లాసులు ఉంటాయని వివరించింది. భారత్-యూకే సెక్టార్ మధ్య విమానయాన సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఎయిర్ ఇండియా సంస్థ అభిప్రాయపడింది.