Formula E Race Case | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు కీలక అడుగు వేశారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో అధికారులు సోమవారం (మార్చి 23న) ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను ప్రధాన నిందితుడు (A1)గా పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ (A2), హెచ్ఎండీఏ మాజీ అధికారి బి.ఎల్.ఎన్ రెడ్డి (A3), కిరణ్ మల్లేశ్వర్రావు (A4), బ్రిటన్కు చెందిన ఎఫ్ఈవో సంస్థ (A5)లను ఈ కేసులో నిందితులుగా ఏసీబీ తమ ఛార్జ్ షీట్లో పేర్కొంది.
క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
గత బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ ఛార్జ్షీటులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏస్ నెక్స్ట్జెన్ సంస్థకు ఫార్ములా ఈ కారు రేస్ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించినందుకుగానూ ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి రూ.45 కోట్లు అందాయని ఏసీబీ చెబుతోంది. ఇది స్పష్టమైన క్విడ్ ప్రో కో అని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్లోనే ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి ఇచ్చిన తరువాత విచారణ వేగవంతం చేసిన ఏసీబీ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది.
కాగా, ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 18, 2024న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. నగదు సంబంధిత అంశం కావడంతో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిధుల దుర్వినియోగంతో పాటు నేరపూరిత కుట్ర జరిగిందని ఏసీబీ ఛార్జిషీట్లో పేర్కొనడంతో కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది.
అసలేం జరిగిందంటే..బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. హుస్సేన్ సాగర్ వద్ద రేసు నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్కు చెందిన గ్రీన్కో కంపెనీ ఏస్ నెక్ట్స్ జెన్, మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) మధ్య 2022 అక్టోబర్ 25న రేసు నిర్వహణపై ఒప్పందం జరిగింది. రేసుల నిర్వహణతో పాటు ట్రాక్ నిర్మాణం కోసం సదుపాయాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కల్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించగా.. ఎఫ్ఈవో, ఏస్ నెక్స్ జెన్ సంస్థల మధ్య విభేదాలు తలెత్తాయి. తమకు డబ్బులు చెల్లించని కారణంగా రేస్ నిర్వహించడం లేదని యూకే సంస్థ ఎఫ్ఈవో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది.
అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఏఎండీ, ఎఫ్ఈవోల మధ్య 2023 అక్టోబర్ లో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. మొత్తం రూ.110 కోట్లు చెల్లించాలని ఎఫ్ఈవో ఒప్పందం చేసుకుంది. మరో 50 కోట్లు సైతం నిధులు విడుదల చేశారు. అయితే ఆర్బీఐ నిబంధనలను కాదని, హెచ్ఎండీఏ నిధుల నుంచి సుమారు రూ.160 కోట్లు కేటాయించడం, అందులో రూ.45 కోట్లకు పైగా విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేయడంపై ఐటీ శాఖ కూడా గతంలో హెచ్ఎండీఏకు రూ.8 కోట్ల జరిమానా విధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపి, మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసింది. కేటీఆర్తో పాటు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు.
రేసు నిర్వహించింది విదేశీ సంస్థ కావడంతో ఆ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ఆన్ లైన్ ద్వారా ప్రశ్నించి వివరాలను ఛార్జిషీటులో పొందుపరిచారు. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఏసీబీ పేర్కొంది. మాజీ మంత్రి కావడంతో కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం నుంచి అనుమతి వేచిచూడాల్సి వచ్చింది. సంబంధిత వ్యక్తులు, సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించిన తర్వాత ఏసీబీ అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. సోమవారం నాడు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
