Hyderabad Latest News: హైదరాబాద్‌ శరవేగంగా విస్తరిస్తోంది. పెరిగిన జనాభా, ఆదాయ మార్గాల మెరుగుదలతో ప్రతి ఇంట్లో కార్ల సంఖ్య పెరగడం నగరంలో ట్రాఫిక్ సమస్యను జటిలం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు, ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్తరమైన వ్యూహాన్ని ప్రకటించింది. కేవలం రోడ్ల విస్తరణకే కాకుండా ఎలివేటెడ్‌ కారిడార్లు, మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ సుందరీకరణ వంటి ప్రణాళికలతో నగర రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన రోడ్డు మ్యాప్‌ను శాసన మండలి వేదికగా వివరించారు. 

Continues below advertisement

ట్రాఫిక్ నియంత్రణకు బిగ్ ప్లాన్

హైదరాబాద్ నగర అభివృద్ధిని ప్రభుత్వం మూడు కీలక విభాగాలుగా వర్గీకరించింది. అవే క్యూర్, ప్యూర్, రేర్, 783 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌ను క్యూర్‌గా పరిగణిస్తున్నారు. ఇక్కడ సర్వీస్‌ సెక్టార్‌పై దృష్టి సారించనున్నారు. ప్యూర్ విభాగంలో ఇండస్ట్రియల్‌ సెక్టార్, రేర్‌ విభాగంలో అగ్రికల్చరల్‌ సెక్టార్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకి తరలించి, నగరాన్ని నివాసయోగ్యంగా మార్చాలని నిర్ణయించారు. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, మేడ్చెల్ కార్పొరేషన్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. 

నలువైపులా ఎలివేటెడ్ కారిడార్లు- సిగ్నల్ లేని ప్రయాణం

నగరం నడిబొడ్డు నుంచి శివార్ల వరకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ నరం నుంచి విముక్తి కలిగించడానికి నాలుగు ప్రధాన జంక్షన్ల వద్ద ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గౌలిగూడ జంక్షన్, చాదర్ ఘాట్ జంక్షన్, నాగోల్‌, అంబర్‌పేట జంక్షన్‌లో ఈ కారిడార్‌లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుల వల్ల భూసేకరణ భారం తక్కువగా ఉండటమే కాకుండా వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగకుండా నేరుగా నగరం వెలుపలకి చేరుకోవచ్చు. 

Continues below advertisement

ముఖ్యంగా మూసీ రిజువెనేషన్ ప్రాజెక్టులో భాగంగా హిమాయత్ సాగర్ జంక్షన్ నుంచి మూసీ నది వెంట గౌరవెల్లి వరకు సుమారు 43 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గంలో గౌలిగూడ, చాదర్ ఘాట్, అంబర్‌పేట, నాగోల్ జంక్షన్‌ వద్ద ట్రంపెట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చేస్తారు. నల్గొండ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిగా మారిన నల్గొండ చౌరస్తా జంక్షన్‌ వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇది జూన్ లేదా జులై నాటికి అందుబాటులోకి వస్తుంది. 

మెట్రో రైలు రెండో దశ 

హైదరాబాద్‌ మెట్రో ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గత దశాబ్ద కాలంలో విస్తరణ జరగకపోవడంతో అది తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం 24వేల కోట్లతో మెట్రో రెండో దశను 76 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రతిపాదించింది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా చేసుకొని, విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం చేనున్నారు. నాగోల్, ఎల్బీనగర్‌ ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయగుట్ట, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో లైన్‌ పొడిగిస్తారు. 

పాతబస్తీ ప్రజల చిరకాల కోరిక మేరకు గౌలిగూడ వద్ద ఆగిపోయిన మెట్రో పనులను పునరుద్ధరించి ఫలక్‌నుమా, చాంద్రాయగుట్ట జంక్షన్‌ కనెక్ట్ చేయనున్నారు అలాగే ఐటీ ఉద్యోగుల కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌, నియోపోలిస్‌ వరకు, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం నుంచి చందానగర్ వరకు మెట్రోను విస్తరించనున్నారు.