YS Sharmila : ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది.  వైఎస్ షర్మిలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుందని వైద్యుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాక్టెట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. బీపీ లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. గ్లూకోజ్  లెవెల్స్ బాగా తగ్గాయని వైద్యులు తెలిపారు. 30 గంటలుగా షర్మిల మంచి నీళ్లు సైతం తీసుకోవడం లేదన్నారు. వెంటనే ఆసుపత్రిలో తరలించకపోతే ప్రాణాలకు ప్రమాదమన్నారు. వైఎస్ షర్మిల ఆరోగ్యం విషమిస్తుండడంతో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు తన దీక్ష విరమించనని షర్మిల అంటున్నారు. 






రెండ్రోజులుగా ఆమరణ దీక్ష 


ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే అరెస్టు చేసిన వైఎస్ఆర్టీపీ నేతలను విడుదల చేయాలని రెండ్రోజులుగా వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.   ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విమరించే ప్రసక్తి లేదని షర్మిల తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ షర్మిల దీక్ష చేస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై వైఎస్సార్టీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు.  పార్టీ ఆఫీస్ కు నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీస్ లు అడ్డుకుంటున్నారు. లోటస్ పాండ్ వద్ద కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది.  



హైకోర్టు అనుమతి ఇచ్చినా 


తన పాదయాత్రకు అనుమతి, అరెస్ట్ చేసిన పార్టీ నేతలను విడిచిపెట్టే వరకు మంచినీళ్లు కూడా ముట్టనని వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేపట్టారు. లోటస్ పాండ్ లో షర్మిల దీక్ష చేస్తున్న ప్రాంతం చుట్టూ పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. పార్టీ కార్యకర్తలను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటూ మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు కానీ ప్రజల పక్షాన పోరాడే వైఎస్సార్టీపీని మాత్రం కార్యక్రమాలు చేసుకోవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తన పాదయాత్రకు అనుమతి ఇచ్చినా కేసీఆర్ నియంతృత్వ పాలనలో న్యాయస్థానానికి,  ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు. తమ పార్టీ శ్రేణులను విడుదల చేసేంత వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని వైఎస్ షర్మిల తేల్చిచెప్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు.