TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు పోలీసులు తెలిపారు. ఎగ్జామ్ నిర్వహణకు రెండు రోజుల ముందే పేపర్ లీకైనట్లు పోలీసులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కలకలం సృష్టిస్తుంది. ప్రశ్నాపత్రాల లీకేజీలో ఇప్పటికే 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగి ప్రవీణ్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌తో పాటు పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పేపర్ కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను కూడా అరెస్టు చేశారు. పేపర్ లీకేజీ నేపథ్యంలో అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే యోచనలో ఉందని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.  


కీలక సమాచారం సేకరించిన పోలీసులు 


టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఓ పక్క అనుమానితుల్ని విచారిస్తూనే మరో వైపు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సహకారంతో బేగంబజార్‌ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు సర్వర్‌లోకి వెళ్లి లాగిన్‌ అయినట్టు పోలీసులకు అధికారులు తెలపడంతో ఆ కోణంలో విచారణ కొనసాగుతోంది. దళారుల వ్యవహారం కూడా బయటకు రావడంతో అనుమానితుల వేటలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. అందుకే నిన్న(మార్చి12న)జరగాల్సిన పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి, ఈనెల 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షను సంబంధించిన పేపర్‌ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. 


11 మంది అరెస్టు 


ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. అతని నుంచి పేపర్‌ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టు సమాచారమున్న నలుగురు అభ్యర్థులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. మొత్తంగా 11 మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాళ్ల కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్.. విచారణలో పలు విషయాలు పోలీసులకు తెలిపినట్టు సమాచారం.  ముగ్గురు దళారులతో కలిసి పేపర్ లీకేజీకి కుట్రపన్నాడని, ఇందుకోసం రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. ప్రవీణ్ కీలక వ్యక్తిగా గుర్తించిన పోలీసులు గతంలో ఏమైనా లీకేజీలకు పాల్పడ్డడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. 


పలు పరీక్షలు వాయిదా


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అవ్వడం రాష్ట్రంలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీకి సంబంధించిన సర్వర్ హ్యాక్ అవ్వడం వల్లే ఇలా జరిగిందని, పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించారు. నిన్న (మార్చి 12) జరగాల్సిన టీపీబీవో (టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్) రాత‌ ప‌రీక్ష 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ రాత‌ ప‌రీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం (మార్చి 11) రాత్రి కమిషన్‌ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది.