Palla Rajeshwar Reddy : ఏపీ, తెలంగాణ విభజనపై మళ్లీ రాజకీయం మొదలైంది. ఈసారి సమైక్యవాదంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉండవల్లి, సజ్జల వ్యాఖ్యలు తాజా చర్చ ఆజ్యం పోశాయి. సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. విభజన చట్టం వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయిందని గుర్తుచేశారు. తెలంగాణ పల్లెలు పచ్చ బడ్డాయి, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ పచ్చబడటాన్ని చూసి కొందరి కళ్లు మండుతున్నాయని విమర్శించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ విభజనపై విషం చిమ్మేలా మాట్లాడారని మండిపడ్డారు. ఆయన ఆషామాషీగా మాట్లాడారు అని భావించడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే తప్పుబట్టేలా మాట్లాడటం కొత్త కాదని, చాలా మంది మాట్లాడారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. 


మోదీ దన్నుతోనే 


"తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మోదీ సహా అవకాశం వచ్చినపుడల్లా చాలా మంది విషం చిమ్ముతున్నారు. ఆ కుట్రలు నిరంతరం కొనసాగుతున్నాయి. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మోదీ మాట్లాడుతున్నారు. సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర ఉంది. ఈ మధ్య మోదీ తరచుగా వైసీపీ నేతలతో మాట్లాడుతున్నారు. మోదీ దన్నుతోనే నాడు చంద్రబాబు మాట్లాడారు. నేడు సజ్జల మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు మోదీ ఎన్నో బాణాలు వదులుతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలాంటి కుట్రలు కేసీఆర్ సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఎదుర్కొంటారు. బీజేపీ తెలంగాణపై కేఏ పాల్ సహా చాలా బాణాలు వదులుతోంది.
తెలంగాణ టాగ్ లైన్ నీళ్లు నిధులు నియమాకాలను కేసీఆర్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ అన్నపూర్ణగా ఉంది ఏపీ కాదు. ఏ రంగంలో చూసినా తెలంగాణ పురోగతి ఏపీని దాటేసింది. అక్కడున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే తెలంగాణ ఏపీలను కలుపుతామని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. " -పల్లా రాజేశ్వర్ రెడ్డి


ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే 


కరెంటు వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ 24 గంటల కరెంటు ఇస్తోందని, ఏపీలో ఆ పరిస్థితి లేదన్నారు. పచ్చబడ్డ తెలంగాణపై వారి కళ్లు మండి అసంబద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అక్కడ ప్రజలకు మేలైన పనులు చేయడం చేతగాకే బాగుపడ్డ తెలంగాణతో కలవాలని వాళ్లు అంటున్నారన్నారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరవై ఏళ్లుగా తెలంగాణను దోచుకున్నది చాలదా? ఇంకా దోచుకోవాలని చూస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఆదేశాల మేరకే కొందరు మొరుగుతున్నారని తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. కాళోజీ స్పూర్తితో టీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే తెలంగాణ పొలిమేరల దాకా తరిమేస్తామన్నారు. మళ్లీ తెలంగాణ, ఏపీ కలవడం గురించి చిల్లర మల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 


షర్మిలకు గవర్నర్ శిక్షణ


"24 గంటల కరెంటును కచ్చితంగా ఇస్తున్నాం. బండి సంజయ్ కు అనుమానం ఉంటే కరెంటు తీగను టచ్ చేసి చూడాలి. బండి ఏ విషయం మీద అవగాహన లేదు. షర్మిలకు గవర్నర్ తో పాటు బీజేపీ శిక్షణ ఇస్తోంది. మోదీతో ఏం మాట్లాడాలో గవర్నర్ షర్మిలకు ట్రైనింగ్ ఇచ్చారు. తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం బీజేపీది. బీజేపీ విసిరే బొక్కలకు కొందరు ఆశ పడుతున్నారు. మేము ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోము. తెలంగాణ ఇలానే ఉంటుంది. ఎవ్వరూ మార్చలేరు. అవసరమైన సందర్భాల్లో తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ జాగృతం చేస్తారు. తెలంగాణ, ఏపీ కలయిక ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎన్ని జెండాలు ఉన్నా ఎవరి ఎజెండా ఎలా ఉన్నా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష." -టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి