తెలంగాణలో హైదరాబాద్‌–రంగారెడ్డి, మహ­­బూబ్‌నగర్‌ జిల్లాల టీచర్స్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభం అయింది. ఇందుకోసం మొత్తం 137 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో ఓటు వేసే ఓటర్లు 29,720 మంది ఉండగా అందులో పురుషులు 15,472, మహిళలు 14,246, ఇతరులు ఇద్దరు ఉన్నారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి 2017 ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. తాజాగా ఈ సారి 21 మంది పోటీలో ఉన్నారు.


టీచర్లు వేర్వేరు ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో కొంతమందికి రెండుచోట్ల ఓట్లు ఉన్నట్లుగా ఎమ్మెల్సీ అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపారు. దీంతో ఎన్నికల అధికారులు వాటిని తొలగించాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లకు సంబంధించి అభ్యర్థులు ఇచ్చిన హామీలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కీలక అభ్యర్థులు వీరే
వరుసగా రెండుసార్లు విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో PRTUTS మద్దతుతో గెలిచారు. తాజాగా పీఆర్‌టీయూ తెలంగాణ మద్దతుతో పోటీ చేస్తున్నారు. PRTUTS ఈసారి గుర్రం చెన్నకేశవ రెడ్డిని బరిలోకి దింపింది. వీరిద్దరి మధ్య ఓట్ల విభజన ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. కాటేపల్లి జనార్దన్‌ రెడ్డికి అప్పట్లో బీఆర్‌ఎస్‌ మద్దతు ఉండేది. ఈసారి అది లేదు. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ప్రచారం చేశారు. 


మరోవైపు, తెలంగాణ UTF అభ్యర్థిగా మాణిక్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఏవీఎన్‌ రెడ్డికి బీజేపీ అనుకూల సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. సీపీఐ అనుబంధ సంఘం STUTS అభ్యర్థిగా బి.భుజంగరావు, టీపీటీఎఫ్, బీఎస్పీ మద్దతుతో ఆచార్య వినయ్‌ బాబు, బీసీటీఏ నుంచి విజయ కుమార్‌ పోటీ చేస్తున్నారు. టీయూటీఎఫ్‌ మద్దతులో మల్లారెడ్డి, జీటీఏ సహకారంతో ప్రభాకర్, లోకల్‌ కేడర్‌ జీటీఏ సపోర్టుతో రవీందర్‌ బరిలో ఉన్నారు. గెలుపు కోసం మూడు నెలలుగా ఎమ్మెల్సీ అభ్యర్థులు వారి వ్యూహాల్లో మునిగి తేలారు. ఆఖరి మూడు రోజుల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఓటర్లకు డబ్బులు కూడా పంచినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.