ఆస్కార్... ఆస్కార్... ఆస్కార్... ఇప్పుడు అందరి చూపు ఆస్కార్ (Oscars 2023) మీద ఉంది. ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద మన హీరోలు నడిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Speech) లుక్ అదిరింది. ఆయన ధరించిన షేర్వాణీ మీద పులి బొమ్మ ఉంది. దాని వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా?


నడిచేది ఇండియా...
అందుకు గుర్తే టైగర్!
ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద ఎన్టీఆర్ (Jr NTR At Oscars)కు ఓ ప్రశ్న ఎదురైంది. 'నీ డ్రస్ మీద టైగర్ ఏంటి?' అని! అప్పుడు ఎన్టీఆర్ ''రెడ్ కార్పెట్ మీద నడిచేది 'ఆర్ఆర్ఆర్' యాక్టర్ కాదు... ఇండియా. అందుకు చిహ్నం ఇది'' అని చెప్పారు. ఆ మాట 'ఆర్ఆర్ఆర్' సినిమా అభిమానులను మాత్రమే కాదు... భారతీయులు అందరూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.


'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ గురించి...
'ఆర్ఆర్ఆర్'కు సీక్వెల్ ఉంటుందని ఇంతకు ముందు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ఒక ఐడియా కూడా ఉందని చెప్పారు. ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద ఎన్టీఆర్ కూడా సీక్వెల్ గురించి మాట్లాడారు. ''సీక్వెల్ తప్పకుండా ఉంటుంది. అయితే... ఎప్పుడు ఉంటుందనేది రాజమౌళి మాకు ఇంకా చెప్పలేదు. స్టార్ట్ చేయాలని మేం వెయిట్ చేస్తున్నాం. అంత కంటే ముందు మా సినిమాలను మేము పూర్తి చేయాల్సి ఉంటుంది'' అని చెప్పారు.


Also Read : ఆస్కార్స్ లైవ్ అప్‌డేట్స్ - విజేతలు ఎవరు? ఎవరికి ఏ అవార్డు వచ్చింది? ఇక్కడ తెలుసుకోండి.  






ఆస్కార్స్ కోసం కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ అమెరికా చేరుకున్నారు. హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు కూడా రెడ్ కార్పెట్ మీద తానొక 'ఆర్ఆర్ఆర్' యాక్టర్ గా కాకుండా భారతీయుడిగా నడుస్తానని చెప్పారు. 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ రావడం గురించి ఎన్టీఆర్ (NTR)ను హోస్ట్ ప్రశ్నించగా... ''ప్రపంచవ్యాప్తంగా సినిమాను సెలబ్రేట్ చేసుకునే ఆస్కార్ అవార్డుల్లో భాగం కావడం కన్నా ఓ యాక్టర్, ఫిల్మ్ మేకర్ ఏం కోరుకుంటాడు? ఆస్కార్స్ రోజున 'ఆర్ఆర్ఆర్' హీరోగా లేదంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా రెడ్ కార్పెట్ మీద నడవను. భారతీయుడిగా ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా. నా గుండెల్లో దేశాన్ని నింపుకొని సగర్వంగా నడుస్తా'' అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు అభిమానులు గర్వపడేలా ఉన్నాయి. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాముఖ్యం ఇచ్చి దేశంపై తనకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో ఎన్టీఆర్ చాటుకొన్నారు.


కాళ్ళు ఇంకా నొప్పి పెడుతున్నాయ్!
'నాటు నాటు...' సాంగ్, అందులో స్టెప్పుల గురించి కూడా 'ఎంటర్టైన్మెంట్ టునైట్' షోలో ప్రస్తావన వచ్చింది. ఆ పాటకు స్టెప్పులు వేయడం వల్ల తన కాళ్ళు ఇంకా నొప్పి పెడుతున్నాయని ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఆ పాట విషయంలో కాంప్రమైజ్ కాలేదని, తమతో 17 టేక్స్ చేయించారని ఎన్టీఆర్, రామ్ చరణ్ గతంలో వివరించిన సంగతి తెలిసిందే. 


ఆస్కార్స్ అవార్డుల వేడుక ముగిసిన రెండు మూడు రోజుల తర్వాత ఎన్టీఆర్ ఇండియా రిటర్న్ అవుతారని సమాచారం. ఆయన వచ్చిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక. దీనికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు వర్క్ చేయనున్నారు. అమెరికాలో అక్కడి ఫైట్ మాస్టర్లతో కూడా ఎన్టీఆర్ డిస్కషన్స్ చేయనున్నారు.