MLC Kavaitha : అనేక మంది అనేక రకాలుగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ఎమ్మెల్సీ కవిత, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని, ఆ వినాయకుని దయవల్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిరంతరాయంగా జరగాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్,  టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటోల కార్తీక్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.



ఆస్ట్రేలియా టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడి నియామకం 


2016లో ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ శాఖను స్థాపించి మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికై, పార్టీని ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేస్తున్న కాసర్ల  నాగేందర్ రెడ్డిని మూడో సారి అధ్యక్షుడిగా టీఆర్ఎస్ NRI కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల నియమించారు. ఎమ్మెల్సీ కవిత, కాసర్ల సురేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.


జాతీయ వాలీబాల్ ఆటగాడికి ఆర్థిక సాయం


ఆస్ట్రేలియాలో జరగ‌నున్న బీచ్ పారావాలీ నేషనల్ సిరీస్ లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన టీఆర్ఎస్ కార్యకర్త, తెలంగాణ ఆటగాడు మహేష్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో మహేష్ కు, ఎమ్మెల్సీ ‌కవిత లక్ష రూపాయల అర్థిక సాయం అందించారు. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో సెప్టెంబర్ 16-20న జరిగే టోర్నమెంట్ లో మహేష్ పాల్గొననున్నారు. 


గవర్నర్ కామెంట్స్ 


తెలంగాణ ప్రభుత్వం పైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అసంతృప్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆఫీసును ప్రభుత్వం చులకనగా చూస్తోందని, తీవ్రమైన వివక్ష చూపిస్తోందని విమర్శించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడికి రావడం లేదని నిలదీశారు. ఒక మహిళను అవమానించిన ప్రభుత్వంగా ముద్ర పడకూడదని అన్నారు. రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు. తాను తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు తీసుకొని మూడేళ్లు పూర్తయి నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, హోంమంత్రిత్వశాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దతు, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. గవర్నర్ గా ఈ మూడేళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని అన్నారు.


హెలీకాప్టర్ అడిగితే కనీస స్పందన లేదు


ఈ సందర్భంగా గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక గవర్నర్ స్థానానికి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. తాను మేడారం, భద్రాచలం పర్యటనలకు వెళ్లినప్పుడు హెలీకాప్టర్ అడిగితే కనీసం ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. చేసేది లేక తాను రోడ్డు మార్గం ద్వారా 8 గంటలు ప్రయాణించి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. పర్యటనల్లో కూడా కలెక్టర్, సీపీ లాంటి ఉన్నతాధికారులు ప్రోటోకాల్ ప్రకారం కూడా హాజరుకాకపోవడాన్ని గవర్నర్ తప్పుబట్టారు. ప్రజల్ని కలవాలంటే కూడా తనకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.