వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లో కూడా బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది మజ్లీస్‌ పార్టీ. తెలంగాణలో డే బై డే ఛేంజ్ అవుతున్న పాలిటిక్స్ కి అనుగుణంగా మజ్లిస్ పార్టీ ఫ్యూచర్ పై దృష్టి సారించింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ... ఇతర జిల్లాల్లో మైనార్టీలు ప్రభావితం చూపే స్థానాల్లో పోటీ చేసేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో వచ్చే 2023 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి ఎఐఎంఐఎం పోటీ చేసేందుకు డిసైడ్ అయ్యింది. దీనిపై ఇటీవలే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఎంఐఎం శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయ్. పార్టీ యాక్టివిటీస్ పెంచుతున్నాయ్.


అసదుద్దీన్ ప్రకటనతో నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లోని ఎంఐఎం నాయకులు ఒక్కతాటిపైకి వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటనతో జిల్లాలోని అర్బన్, బోధన్ నియోజకవర్గం పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి 2014 ఎన్నికల్లో ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీర్ మజాజ్ అలీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా ఉన్నప్పటికీ ఎంఐఎం క్యాండిడేట్ ఎలాంటి ప్రచారం చేయకుండానే రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బిగాల గణేష్ గుప్తా 42 వేల 148 ఓట్లతో గెలిచారు. అంటే 31.15 శాతం ఓట్లు వచ్చాయ్. ఎంఐఎం అభ్యర్థి మీర్ మజాజ్ అలీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అతనికి 31 వేల 840 ఓట్లు అంటే 23.53 శాతం ఓట్లు వచ్చాయ్. ఒక్కసారిగా అర్బన్ పోలిటికల్ స్ట్రీట్‌లో ఈ అనూహ్య మార్పు ఆశ్చర్యానికి గురిచేసింది.


నిజామాబాద్ కార్పోరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉంటాయ్. ఇందులో గత కార్పోరేషన్ ఎన్నికల్లో 16 డివిజన్ల నుంచి కార్పోరేటర్లుగా ఎంఐఎం నుంచి గెలిచారు. నిజామాబాద్ అర్బన్‌లో ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉంటాయ్. ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలన్నా వీరి మద్దతు తప్పని సరి అవుతుంది. ముస్లిం ఓటర్లు, మున్నూరు కాపు ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ విన్ అవుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి కలుపుకొని పోవాలన్న ఆలోచనలో ఒవైసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మున్నూరు కాపు సామాజికవర్గానికి ఎంఐఎం తరఫున అభ్యర్థిని బరిలో దింపేందుకు సైతం మజ్లిస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బొబ్బిలి నర్సయ్య కూడా ఎంఐఎం టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. డీఎస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ ఆ పార్టీ నాయకులు కొందరు విభేదిస్తుండటంతో ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ నుంచి కాకుంటే ఎంఐఎం నుంచైనా సంజయ్ బరిలో దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


ఇక బోధన్ నియోజకవర్గంలోనూ ముస్లిం మైనార్టీల ఓట్లు మెజార్టీగా ఉంటాయ్. బోధన్ పట్టణంలో గత మున్సిపల్ ఎన్నికల్లో 11 మంది ఎంఐఎం నుంచి కౌన్సిలర్లు గెలిచారు. మొత్తం 38 వార్డులుంటాయ్. బోధన్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎటు పడితే ఆ అభ్యర్థి విజయం ఖాయంగా ఉంటుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ వారు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మజ్లిస్ పార్టీ తమ స్టాండ్ మార్చుకుంటోంది. తెలంగాణలో బీజేపీ కూడా పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై కన్నేసింది. బోధన్ నియోజకవర్గం నుంచి గతంలో ఎంఐఎం తరఫున ఎవరూ పోటీ చేయలేదు. ఈ సారి ఒవైసీ అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థిని పోటీలో ఉంచేందుకు డిసైడ్ అయ్యారు. 


ఒవైసీ నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయ్. ఈ రెండు నియోజకవర్గాల్లో మిగతా ప్రధాన పార్టీలు ఓట్లను చీల్చుకుంటే మాత్రం ఎంఐఎం అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండటంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.