పబ్ ల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ డ్రగ్స్ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్నాయని ప్రజాప్రతినిధుల కుమారులైనా సరి వదిలిపెట్టవద్దని సూచించారన్నారు.  హైదరాబాద్ నగరంలో లా అండ్ అర్దర్ కంట్రోల్ ఉందన్న ఆయన ఏడు సంవత్సరాలుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. హైదరాబాద్ అంటేనే భరోసా అని ప్రశాంత జీవనాని సంకేతం అన్నారు. ఒడిశా, ఏపీ రాష్ట్రాల్లో గంజాయి ఎక్కువ సాగు చేస్తున్నారని మంత్రి అన్నారు. అక్కడి నుండి గంజాయి కొని కొంతమంది హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి అరెస్టు చేసి పీడీ యాక్టులు పెడుతున్నామన్నారు. 






పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తే నిరభ్యంతంగా సీజ్ 


'వివిధ రకాలుగా నగరంలో డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఎక్కడ గంజాయి, డ్రగ్స్ దందా నడిచిన ఉక్కుపాదం మోపమని సీఎం ఆదేశించారు. ఎక్కువగా పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఉందని మా దృష్టికి వచ్చింది. పబ్బులో డ్రగ్స్ తో పట్టుబడితే మీ వెనకాల ఎవరు ఉన్న ఉపేక్షించేది లేదు. డ్రగ్స్ వినియోగదారుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్న వారిని కూడా వదలవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. పబ్బుల్లో యజమానులు డ్రగ్స్ వాడకం దృష్టి పెట్టాలి. ఎక్సైజ్ పోలీసులు ఎప్పటికప్పుడు పబ్బులను పర్యవేక్షిస్తూ ఉంటారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడకం వెలుగులోకి వస్తే ఆ పబ్బులను నిరభ్యంతరంగా సీజ్ చేస్తాం. డబ్బులు సంపాదించడానికి అనేజ మార్గాలు ఉంటాయి. అంతేగాని పబ్బులో డ్రగ్స్ అమ్మి సంపాదిస్తాం అంటే కుదరదు. మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ అమ్మిన మా డిపార్ట్మెంట్ నుండి తప్పించుకోలేరు. పబ్బులో కఠినంగా వ్యవహరించండి. డ్రగ్స్ పై ఫిర్యాదులు చేయడానికి హెచ్చరించడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కనిపించేలా పెట్టండి. కొందరు పబ్బుల్లో అక్రమ దందాలు చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. పబ్స్ కు వచ్చిన వారు ఎన్ని సిగరేట్ లు తగుతున్నారు. ఒక సిగరెట్ ను మరో నలుగురు పంచుకుంటున్నారా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 


భారీ సౌండ్స్ ను కంట్రోల్ చేయండి


పబ్బుల్లో  విచ్చలవిడిగా సౌండ్ పెడుతున్నారని, అలాంటి వాటిని కట్టడిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  పక్కన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిమితికి లోబడి సౌండ్స్ సిస్టమ్స్ పెట్టాలని సూచించారు. పబ్బులపై పర్యవేక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిని అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తామన్నారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నట్టు అనుమానం వస్తే వెంటనే వారి వివరాలు పోలీసులకు ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. వెంటనే పోలీసులు స్పందించి వారిని అదుపులోకి తీసుకుంటారన్నారు. మీ కొడుకులే ఈ డ్రగ్స్ అలవాటు పడితే మీరు ఎంకరేజ్ చేస్తారా.. అని మంత్రి పబ్బుల నిర్వాహకులను ప్రశ్నించారు. పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మీ దృష్టి వస్తే 1800-4252523 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. 


Also Read: హైదరాబాద్ పబ్ లో మొదలైన స్నేహం డ్రగ్స్ మత్తులో దించింది... విశాఖ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు