Minister KTR : దేశంలోని ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధానమంత్రి మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు.  భారత దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని  విమర్శించారు. నవంబర్ 8, 2016న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు.  నల్లధనం వెలికి తీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ బీజేపీ ప్రభుత్వం చెప్పిన ఆ మాటలన్నీ అవాస్తవాలేనని  తేలిపోయిందన్నారు.  రేపటితో నోట్ల రద్దు లాంటి విఫల నిర్ణయానికి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నోట్ల రద్దు దుష్పఫలితాలను గుర్తు చేస్తూ, వాటికి బాధ్యత తీసుకోవాలని ప్రధానిని డిమాండ్ చేశారు.  నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కుంగదీసిందని, ప్రధాని చెప్పిన ఒక్క లక్ష్యం కూడా నెరవేరలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 


బీజేపీ చెప్పినవన్నీ అసత్యాలే 


నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కూడా నేటికీ ఆర్థిక వ్యవస్థలో సుమారు 30.88 లక్షల కోట్ల నగదు ప్రజల వద్ద ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. నోట్ల రద్దుపైన బీజేపీ చెప్పిన అన్ని మాటలు అసత్యాలే అని తెలిపోయిందన్నారు. 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత 2017 జనవరి నాటికి 17.97 లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉంటే, ప్రస్తుతం అది 72 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 30.88 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.  2016 నుంచి  అదనంగా 12.91 లక్షల కోట్ల నగదు కొత్తగా చలామణిలోకి వచ్చిందన్నారు. 2016 నుంచి ప్రతి ఏటా ఆర్థిక వ్యవస్థలో తమ లావాదేవీల కోసం నగదును  వినియోగిస్తున్న ప్రజలు శాతం క్రమంగా పెరుగుతూ వస్తున్నదని కేంద్ర ప్రభుత్వ గణంకాలు నిరూపిస్తున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్కువ నగదు ఉన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, లావాదేవీలాడిజిటలైజేషన్, బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడం, నగదు డిపాజిట్ చేయడం వంటి వాటిపైన పెద్ద ఎత్తున పరిమితులు పెట్టినా తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నెరవేరలేదన్నారు. 


నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఏది? 


కేంద్ర ప్రభుత్వం నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేయడంలో పూర్తిగా విప్లమైందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.  రద్దయిన పెద్దనోట్ల సొమ్ము లో 99.3 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ గణాంకాలతో సహా ప్రకటించిందన్నారు. రద్దయిన పెద్ద నోట్ల విలువ 15.41 లక్షల కోట్లుకాగా.. తిరిగి డిపాజిట్ అయిన వాటి విలువ 15.31 లక్షల కోట్లని తెలిపిందన్నారు. లక్షల కోట్ల నల్లధనాన్ని పట్టుకోవడానికే నోట్ల రద్దు అస్త్రం ప్రయోగించామని ప్రకటించుకున్న కేంద్రం.. చివరికి తెల్ల ముఖం వేయాల్సి వచ్చిందన్నారు.  కొత్త నోట్ల ముద్రణకు ఆర్బీఐకి 21 వేల కోట్ల ఖర్చు కావడం తప్ప సాధించింది శూన్యమన్నారు. ఇప్పటికీ దేశంలో సుమారు  కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేవని, 50 శాతం పైగా ఈ -కామర్స్ లావాదేవీల్లో సైతం క్యాష్ అండ్ డెలివరీ పద్ధతిని వినియోగిస్తూ తమ లావాదేవీల కోసం నగదునే ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. 


2020 ముందే పతనావస్థకు 


 నోట్ల రద్దు, కరోనా లాక్డౌన్ వంటి వాటిని ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణాలుగా చూపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, లాక్ డౌన్ కన్నా ముందే 2020 నాటికి వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉన్న విషయాన్ని దాచి పెట్టిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.  కేవలం  ప్రధానమంత్రి అనాలోచిత నిర్ణయం వల్లే ఈరోజు దేశంలోని ప్రజలు, ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. నోట్ల రద్దు, కరోనా వల్ల సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు మొదలుకొని భారీ పరిశ్రమల దాకా అనేక ఇబ్బందులు ఎదుర్కోన్నాయని, లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది అన్నారు. ప్రజలు నిరుద్యోగుల మారడంతో 2016-2019 మధ్య సుమారు 50 లక్షల ఉద్యోగాలు కొల్పోయారన్నారు. 2016లో 88 లక్షల మంది కనీసం ఐటీ రిటర్న్ లు సైతం దాఖలు చేయలేకపోయారన్నారు.  


ప్రధాని క్షమాపణ చెప్పాలి 


50 రోజుల సమయం ఇవ్వాలని తన నోట్ల రద్దు నిర్ణయం తప్పయితే, సజీవంగా దహనం చేయాలని అప్పుడు ప్రధానమంత్రి ప్రజలను మాటలతో మభ్యపెట్టారని మంత్రి కేటీఆర్ విమర్శంచారు. సజీవ దహనం మాట పక్కన ఉంచి కనీసం నోట్ల రద్దు దుష్పరిణామాలకు బాధ్యతను తీసుకునేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు నిపుణుల అభిప్రాయం మేరకు దేశ ఆర్థిక వ్యవస్థను అడ్డంగా కూలదోసి, ప్రజల జీవితాలను తారుమారు చేసిన నోట్ల రద్దు తప్పు అని ఒప్పుకొని దేశ ప్రజానీకానికి ప్రధానమంత్రి మోదీ క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేకమైన అడ్డదిడ్డమైన, అర్థరహితమైన నిర్ణయాలు తీసుకుంటూ రికార్డు స్దాయి నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి అనేక దుష్పరిణామాలతో మరింత తిరోగమనానికి దారి తీసేలా కేంద్రం వ్యవహరిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.