Minister Harish Rao : ప్రధాని మోదీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని విమర్శించారు. ప్రధాని మోదీని నిలదీస్తూ మంత్రి హరీశ్ రావు వరుస ట్వీట్స్ చేశారు. #ModiMustAnswer యాష్ టాగ్ కూడా జోడించారు మంత్రి హరీశ్ రావు. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానం ప్రకటిస్తారని ఆశించామని హరీశ్ రావు అన్నారు. కానీ ప్రధాని కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప స్పష్టమైన విధానమే లేదని తేల్చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా అసలు తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారని ఎద్దేవా చేశారు.






తెలంగాణకు మొండి చెయ్యి 


తెలంగాణకు ప్రధాని మోదీ మొండి చెయ్యి చూపారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గుజ‌రాత్‌కు వ‌రాలు ఇస్తారని, క్రూడాయిల్ రాయ‌ల్టీ రూ.763 కోట్లు విడుద‌ల చేశారన్నారు. 'రాజ్‌కోట్‌కు ఎయిమ్స్ ఇస్తారు. బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. ఆయుర్వేదిక్ యూనివ‌ర్సిటీకి జాతీయ హోదా ఇస్తారు. ట్రెడిష‌న‌ల్ మెడిసిన్‌కు సంబంధించి గ్లోబ‌ల్ సెంట‌ర్ మంజూరు చేశారు. నేష‌న‌ల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చారు. ఇంకా ఎన్నో ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌కు మిష‌న్ యూపీకి రూ.55,563 కోట్లు ఇచ్చారు. 9 మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇచ్చారు. క‌ర్నాట‌క‌కు తూముకూర్ ఇండ‌స్ట్రీయ‌ల్ స్మర్ట్ సిటీ, ముంబయి-బెంగ‌ళూరు ఎక‌నామిక్ కారిడార్‌, మైసూర్ టెక్స్‌టైల్ మెగా క్లస్టర్‌ ఇట్లా ఎన్నో ఇచ్చారు. మ‌రి తెలంగాణకు కూడా ఇట్లానే ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. కానీ, మొండి చెయ్యి ఇచ్చారు. ఒక్కటి కూడా ప్రజల‌కు ప‌నికి వ‌చ్చే ప్రక‌ట‌న చేయ‌లేదు' అని మంత్రి హరీశ్ రావు అన్నారు. 






మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆమోదించలేదు? 
 
తెలంగాణ నుంచి ల‌క్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామ‌ని ప్రధాని మోదీ చెప్తున్నారని, మ‌రి గ‌డిచిన నెల రోజులుగా 90 ల‌క్షల ట‌న్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం ఎందుకు తీసుకోవ‌డం లేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సీఎంఆర్ తీసుకునేందుకు కేంద్రం నిరాక‌రిస్తుందన్నారు. వీటి విలువ రూ.22 వేల కోట్లు ఉంటుందన్నారు. ఇదేనా రైతు అనుకూల‌త అని ప్రశ్నించారు. రైతుల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ తీసుకుంటామ‌ని ప్రధాని మోదీ ప్రకటిస్తార‌ని ఆశించామని కానీ ఆ ఊసెత్తలేదన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలో మ‌హిళ‌లను ఉద్దరిస్తున్నట్టు చెప్పారని, మరి పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఎనిమిదేళ్లు అయినా ఎందుకు ఆమోదించ‌లేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణాలో స్థానిక సంస్థల్లో 50 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ఇచ్చి సీఎం కేసీఆర్ నిబ‌ద్దత చాటుకున్నారన్నారు. 


 నేషనల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు?


గిరిజ‌న మ‌హిళ‌కు రాష్ట్రప‌తిగా అవ‌కాశం ఇచ్చామ‌ని కేంద్ర మంత్రులు విజ‌య సంక‌ల్ప స‌భ వేదిక‌గా చెప్పారన్న మంత్రి హరీశ్ రావు.. తెలంగాణలో గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని శాస‌న‌స‌భలో తీర్మానం చేసి పంపించామన్నారు. దాన్ని ఇప్పటి వ‌ర‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించ‌లేదని ప్రశ్నించారు. తెలంగాణ గిరిజ‌న యూనివ‌ర్సిటీకి ఇప్పటికీ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. స‌మ్మక్క సార‌లమ్మ ఉత్సవానికి నేష‌నల్ స్టేట‌స్ ఎందుకు ఇవ్వలేదని వరుస ట్వీట్లు చేశారు మంత్రి హరీశ్ రావు.