Hyderabad Metro Six New Stations:హైదరాబాద్‌(Hyderabad)లో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే భాగ్యనగరంలో మెట్రో (Metro)పరుగులు పెడుతుండగా...మరికొన్ని మార్గాల్లో విస్తరించనున్నారు. ఇప్పటికే విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు అడుగులుపడగా...ఇప్పుడు కొత్తగా హయత్‌నగర్‌(Hayatnagar), ఎల్బీనగర్‌(LBNagar) మార్గంలో ఏడు కిలోమీటర్ల  మెట్రోసర్వీసుకు  పచ్చజెండా ఊపారు.


ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మెట్రో
అత్యంత రద్దీగా మారిన హయత్‌నగర్‌- ఎల్బీనగర్‌ మార్గంలో మెట్రోరైలు(Metro Rail) విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉండే ఈ మార్గాన్ని ఇటీవలే ఆరు వరుసలకు విస్తరిస్తుండగా...ఇప్పుడు మెట్రోరైలు రానుండటంతో ట్రాఫిక్(Traffic) కష్టాలు తీరనున్నాయి. మొత్తం ఏడు కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో ఆరు స్టేషన్లు రానున్నాయి. అంటే కిలోమీటర్‌కు ఒక స్టేషన్‌ ప్రతిపాదించారు. ఇప్పటికే  ప్లైఓవర్ల  నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా మెట్రోస్టేషన్లు (Metro Stastions) నిర్మించే ప్రాంతాలపై  అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోడ్డుకు ఎటువైపు ఉన్న స్టేషన్‌కు చేరుకునేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈమేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులతో  డీపీఆర్‌(DPR)లు సిద్ధం చేస్తున్నారు.


రెండో దశ విస్తరణ
రెండోదశ మెట్రో మార్గాన్ని 70 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనికి సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. ఎల్బీనగర్‌నగర్‌ (L.B.Nagar)నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఉన్న మార్గం ఒకటి కాగా....ఫలక్‌నుమా నుంచి ఈ మార్గం వరకు మెట్రోను విస్తరించనున్నారు. అలాగే ఎల్బీనగర్‌- నాగోలు మార్గాన్ని సైతం అనుసంధానించనున్నారు. ఇప్పుడు ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు విస్తరించడంతో కీలకమైన ప్రాంతాలు అందుబాటులోకి రానున్నాయి.


 ఎల్బీనగర్-హయత్‌నగర్(Hayatnagar) మార్గంలో చింతలకుంట వద్ద మెట్రో స్టేషన్ రానుంది. ఎల్బీనగర్‌ నుంచి ఇక్కడి వరకు రోడ్డుకు మధ్యలోనే మెట్రో మార్గం నిర్మించనున్నారు. మిగిలిన ఐదుచోట్ల ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన రహదారిపై ప్లైఓర్ల నిర్మిణం జరుగుతున్నందున...చింతలకుంట(Chinthalakunta) నుంచి హయత్‌నగర్ మధ్య రోడ్డుకు ఎడమవైపున  సర్వీస్‌రోడ్డులో మెట్రోమార్గం నిర్మించే అవకాశం ఉంది. స్టేషన్లు సైతం విజయవాడ(Vijayawada)కు వెళ్లే మార్గంలో ఎడమవైపునే రానున్నాయి. అయితే కుడివైపు నుంచి స్టేషన్లకు చేరుకునే వారి కోసం...రోడ్డుకు అవతలి వైపు వరకు పైవంతెనలు నిర్మించనున్నారు. 


హయత్‌నగర్‌ మార్గంలో పెరిగిన రద్దీ
రోజురోజుకు హైదరాబాద్(Hyderabad) నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో...అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది తూర్పువైపున ఉండే విజయవాడ మార్గం ఒక్కటే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటువైపు అనుకున్న వేగంగా నగరం విస్తరించలేదు. ఇప్పుడు ఓఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తవ్వడంతోపాటు  ఎక్కువ ఖాళీ ప్రాంతం ఇటువైపే ఉండటంతో నగరవాసుల చూపు ఇటువైపు పడింది. అంతగా కాలుష్యం లేకపోవడం, పెద్దపరిశ్రమలు ఏమీ ఇటువైపు లేకపోవడంతో చాలామంది ఐటీ ఉద్యోగులు, ఇతరులు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతానికి తరలివస్తున్నారు. మెట్రో నిర్మాణంతో ఐటీకారిడార్‌కు రాకపోకలు చాలా సులభంగా మారడంతో పెద్దఎత్తున ఇటువైపు తరలివచ్చారు. నగరంలో ఇరుకు గదుల్లో ఉండలేక...అద్దె భారం భరించలేక చాలామంది నగర శివారులకు తరలిరావడంతో హయత్‌నగర్‌- ఎల్బీనగర్‌ మార్గంలో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇప్పుడు మెట్రో హయత్‌నగర్ వరకు విస్తరిస్తుండటం ఐటీ ఉద్యోగులకు కలిసిరానుంది. మెట్రోమార్గం విస్తరణతో ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అద్దెలు కూడా పెరగనున్నాయి.