Jeevitha Rajasekhar : గరుడ వేగ సినిమా లావాదేవీలపై వచ్చిన ఆరోపణలపై జీవిత రాజశేఖర్ స్పందించారు. చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిన మాట నిజమే కానీ ఎవరూ అరెస్టు కాలేదన్నారు. ఈ కేసులో నగరి కోర్టులో రెండు నెలల క్రితమే తీర్పు వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామన్నారు. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ తో విష ప్రచారం చెయ్యొద్దని ఆమె కోరారు. గరుడ వేగ సినిమా ఆర్థిక లావాదేవీలలో జీవిత, రాజశేఖర్ తమని మోసం చేశారని జోస్టార్స్ ప్రొడెక్షన్స్ కు చెందిన కోటేశ్వరరాజు, హేమ తిరుపతి శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. రాజశేఖర్, జీవితపై క్రిమినల్ కేసులు పెట్టామని, త్వరలో అరెస్టు చేస్తారని అన్నారు. 


ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?


ఈ ఆరోపణలపై జీవిత రాజశేఖర్ శనివారం స్పందించారు. తాము రూ.26 కోట్లు ఇవ్వాలని అన్నారని, అది నిరూపించాలని సవాల్ చేశారు. ఇంతటి వేసుకునే కోట్లా దాచుకునే కోట్లా చెప్పాలని వెటకారం చేశారు. ఏం జరిగినా తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన చెందారు. యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టి తన కూతురిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వార్త వేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. 


దేనినైనా ఎదుర్కొంటా? 


గరుడ వేగ సినిమాకు సంబంధించి జీవిత, రాజశేఖర్‌ తమని మోసం చేశారని నిర్మాత కోటేశ్వరరాజు, హేమ ఆరోపించారు. శేఖర్‌ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న జీవిత ఈ ఆరోపణలపై మాట్లాడారు. సుమారు రెండు నెలల నుంచి కేసు కోర్టులో ఉందని, కానీ ఇప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదన్నారు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితమే వారెంట్‌ ఇష్యూ అయినా తమకెలాంటి నోటీసులు అందలేదన్నారు. తమ గౌరవానికి భంగం కలిగించడం ఎవరి తరం కాదన్నారు. తమ గురించి ఆరోపణలు చేసిన వాళ్లేమీ మహాత్ములు కాదని, వాళ్ల వల్ల తమ మేనేజర్‌, చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కేసు విషయంలో దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. యూట్యూబ్‌లో కొంతమంది పెడుతున్న థంబ్ నెయిల్స్ చూస్తుంటే బాధగా అనిపిస్తోందన్నారు. 


Also Read : Rajasekhar Jeevitha : హీరో రాజశేఖర్ పై క్రిమినల్ కేసు, త్వరలో జైలుకు- నిర్మాత సంచలన ఆరోపణలు