Formula E Race : హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు వాహనదారులు దూసుకొచ్చారు. దీంతో ప్రాక్టీస్ రేస్ నిర్వాహణలో ఆలస్యం అయింది. ట్రాక్ మీదకు స్థానికులు వాహనాలు ఎలా వచ్చాయని రేసింగ్ నిర్వాహకులు ఆందోళన పడుతున్నారు. ట్రాక్  పైకి  వాహనాలు అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలు చేపట్టారు అధికారులు. కానిస్టేబుళ్లను  అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రాక్టీస్ రేస్ వల్ల వాహనాలను దారిమళ్లించారు పోలీసులు. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను తోసుకుని ట్రాక్ పైకి వచ్చారని తెలుస్తోంది. 


రేసింగ్ ట్రాక్ పై ప్రమాదం 


రేసింగ్ ట్రాక్ పై ప్రమాదం జరిగింది. ప్రాక్టీస్ రేస్ మొదలైన కొద్దిసేపటికే సైడ్ వాల్ ను రేసింగ్ కారు ఢీకొట్టింది. మలుపులో కారు అదుపు తప్పి వాల్ ను ఢీకొట్టింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు ఎగిరిపడింది.  ప్రమాద ప్రాంతానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. ప్రాక్టీస్ రేస్ మొదలైన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. దీంతో రేస్ కు బ్రేక్ ఇచ్చారు.  



హుస్సేన్ సాగర్ వద్ద రేసింగ్ 


హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన రేపటి(శనివారం) నుంచి రయ్ రయ్ మంటూ స్పోర్ట్స్ కార్లు దూసుకెళ్లనున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఐమ్యాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్లు దీనికోసం సర్క్యూట్ ను తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 11వ జరగనున్న ఈ రేస్ లో 11 ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్ కార్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాబోతున్నారు. 208 కిలోమీటర్లలో మొత్తం 18 మలుపులు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సందర్శకుల కోసం 11 స్టాండ్లు, 7 గేట్లను కూడా ఏర్పాటు చేశారు.


వారం రోజుల ముందు నుంచే ఆంక్షలు


ఈ రేస్ లో పాల్గొనబోయే కార్లు గంటకు 280 కిలో మీటర్ల గరిష్టవేగంతో ప్రయాణించగలమని... 250 కేవీ పవన్ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మన దేశంలో నిర్వహించబోయే మొట్టమొదటి ఫార్ములా ఈ రేసింగ్ కు ఏర్పాట్లు చురుగ్గా పూర్తి చేశారు. వారం రోజుల ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. స్ట్రీట్ సర్క్యూట్ కు రెండు వైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు సిద్ధం చేశారు. ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లతో పాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే బుక్ మై షోలో ఈ రేస్ ఫార్ములాకు సంబంధించిన టికెట్లు అమ్మకానికి పెట్టారు. పోటీలకు తరలివచ్చే దేశ, విదేశీ పర్యాటకుల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ సరికొత్త హంగులు తీసుకొస్తున్నారు. 


చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్లతో వేదిక ఏర్పాటు


ఫార్ములా ఆ రేస్ సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్లలో ఫిట్టింగ్ తో  పాటు వాటి నిర్వహణ తదితర అంశాలను ఇంజినీర్లతో కలిసి పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా ఇతరులను కార్ల విడి భాగాల ప్రదేశాన్ని సందర్శించడానికి అనుమతిని నిరాకరించారు. పీపుల్‌ ప్లాజాలో చిన్నారుల కోసం ఫ్యాన్ విలేజీ వేదికను ఏర్పాటు చేసారు. ఈ రేసింగ్ చూసేందుకు వచ్చే చిన్నారులు, విద్యార్థులు, యువత కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు నిర్వాకులు చెప్పారు. వినోదాత్మక కార్యక్రమాలతో ఈ వేదిక ద్వారా చిన్నారులు ఉత్సాహంగా గడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఓ వేదికను ఏర్పాటు చేశారు.