Bhatti Vikramarka : తెలంగాణ విమోచన పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేని టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల్లో సెంటిమెంటు రగిలించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో  తెలంగాణ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా భూమికోసం, భుక్తి కోసం , ఎట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటం గురించి చర్చ జరగాలన్నారు. దున్నేవాడికి భూమి కావాలన్న పోరాటం నుంచి భూమి హక్కు చట్టం ఎట్లా వచ్చింది?  టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి భూమిపై హక్కు కల్పించి తొలుత పట్టాలు ఎవరు పంపిణీ చేశారన్న దానిపై చర్చ జరగాలన్నారు. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరకాలం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఆనాడు రజాకర్ల సైన్యాన్ని అడ్డుపెట్టుకొని దేశ్ ముఖ్ లు జాగిర్దారులు, జమీందారులు ప్రజలపై జరిపిన దాష్టీకాలు, దాడులు, అరాచకాలపై చర్చ జరగాలని భట్టీ విక్రమార్క అన్నారు. 


చరిత్ర వక్రీకరణ 


"ఆనాడు రైతులు, కూలీలు, ప్రజలను హింసించి వెట్టి చాకిరి చేయించుకొని స్త్రీల మానాలను దోచుకున్న వారు ఎవరన్న దానిపై చర్చ జరగాలి. ఎవరు ఎవరిని హింసించారు? ఎవరు పీడింపబడ్డారు? ఆనాడు గ్రామాల్లో ప్రజలు ఎవరిచేత ఇబ్బందులు పడ్డారో చర్చ జరిగితే మతోన్మాద శక్తులు వక్రీకరిస్తున్న చరిత్ర కాకుండా అసలైన చరిత్ర ప్రజలకు తెలుస్తుంది. దేశ్ ముఖ్ లు, జాగిర్దారులు, జమీందారులు విధించిన భూమిశిస్తు పండించిన పంటకు సైతం ఎక్కువగా ఉండడంతో దున్నేవాడికే భూమి కావాలని ఆనాడు కమ్యూనిస్టు సంఘాలు పెట్టి వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. విసునూరు రామచంద్ర రెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా భూమి కావాలని సంఘం నాయకులు ర్యాలీ తీస్తున్న క్రమంలో విసునూరు రామచంద్రారెడ్డి దొర రౌడీ మూకలు, ప్రైవేటు సైన్యం జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. దున్నేవాడికే భూమి హక్కు కావాలని సంఘాలు పెట్టి పోరాడుతున్న కమ్యూనిస్టు నాయకులు దొడ్డి కొమరయ్య మరణం తర్వాత సాయుధ పోరాటం ద్వారానే న్యాయం జరుగుతుందని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిపారు."- భట్టి విక్రమార్క 


హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ పోరాటం 


ఆనాడు ఒక వైపు దున్నేవాడికి భూమి కావాలని దొరలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్న క్రమంలోనే నిజాం రాజ్యం నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం  కావాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ ఆలోచనలు ప్రచారం చేస్తూ స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రంధాలయ ఉద్యమం చేపట్టారని గుర్తుచేశారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు  సత్యాగ్రహంతో పాటు అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర్య ఉద్యమాన్ని రగిలించారన్నారు. తెలంగాణలో నిజాం రాచరిక పరిపాలనలో పీడనకు గురవుతున్న ప్రజల బాధలు, దొరల ఆగడాలు, దాష్టీకాలు, దాడుల గురించి ఆనాటి ప్రధాని నెహ్రూతో మాట్లాడి ఈ ప్రాంతానికి స్వరాజ్యం ఇవ్వాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు వేడుకున్నారని భట్టి తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జనరల్ చౌదరి నాయకత్వాన ఆనాటి ప్రధాని నెహ్రూ తెలంగాణకు సైన్యాన్ని పంపించి 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజును లొంగదీసుకుని తెలంగాణకు స్వాతంత్ర్యం కల్పించారని తెలిపారు.  


 రైతులకు భూములపై హక్కులు


"దున్నేవారికి భూమి కావాలని కమ్యూనిస్టులు చేసిన పోరాట లక్ష్యాన్ని 1952లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నెరవేర్చారు. ప్రజల లక్ష్యాలను చట్టబద్ధం చేస్తూ రైతులకు భూములపై హక్కులు కల్పిస్తూ భూమి హక్కు చట్టాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆనాడు గడీల పాలనలో జరిగిన రాచరిక దుర్మార్గపు చేష్టలు, జాగిర్దారులు, జమీందారులు దేశ్ ముఖ్ లు వెట్టి పేరుతో ప్రజలపై చేసిన దాడులు, అరాచకాలు, దాష్టీకాలు, ఆకృత్యాలు ఎంత భయంకరంగా ఉండేవో చర్చ జరగాలి. ఇలా చర్చలు జరగడం వల్ల ఆనాటి ప్రజల లక్ష్యాన్ని నెరవేర్చడానికి అద్భుతమైన చట్టాలు చేసుకుని ప్రజా సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుంది.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15 రోజును ఎలా జరుపుకుంటామో 1948 సెప్టెంబర్ 17ను కూడా తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుని మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి"- భట్టి విక్రమార్క 


Also Read : TS Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో అవే గ్రూపు గొడవలు - తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వాయిదా !