DK Aruna : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామయాత్రపై టీఆర్ఎస్ నాయకుల దాడి చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల పట్టణంలో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు యాత్రపై దాడికి పాల్పడ్డారని డీకే అరుణ ఆరోపించారు. ముందస్తు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదని డీకే అరుణ విమర్శించారు. 


పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా


పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా  ప్రజాస్వామ్యయుతంగా తమ విధులను నిర్వర్తించాలని డీకే అరుణ సూచించారు. తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతుంటే వారి బాధలు వినడానికి ఫామ్ హౌస్ దాటి బయటికి రాలేని కేసీఆర్, పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై, వరుసగా దాడులు చేయించడం పిరికిపందతనానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు. ఇంతకు ముందు బండి సంజయ్ ఉద్యోగుల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తుంటే , పోలీసులు దౌర్జన్యంగా వారి కార్యాలయాన్ని ధ్వంసం చేసి అరెస్టు చేసిన ఘటన మరువకముందే, ఇవాళ పోలీసుల సమక్షంలోనే ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం టీఆర్ఎస్  అసహనాన్ని తెలియజేస్తుందని డీకే అరుణ అన్నారు.


ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలని సవాల్ 


దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు తిరిగితే  ఇక్కడి టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండని డీకే అరుణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్లి వారి కష్టాలు అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న బీజేపీ నేతలపై దాడులు చేయడం అంటే ప్రజలపై నేరుగా దాడులు చేసినట్టేనన్నారు. బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరిస్తూ ఉండడంతో, వాళ్ల బండారం ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. టీఆర్ఎస్ అధికార పీఠాలు కదిలి ఇలా భౌతిక దాడులకు దిగుతున్నారని, కేసీఆర్ కు ఏ మాత్రం ధైర్యం ఉన్నా ప్రజాక్షేత్రంలో నేరుగా బీజేపీని ఎదుర్కోవాలని సవాల్ చేశారు. అంతేకానీ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు ప్రజా సంగ్రామ యాత్రపై దాడులకు దిగితే బీజేపీ చెప్పే సమాధానం టీఆర్ఎస్ పార్టీకి అర్థమయ్యే రీతిలోనే ఉంటుందని డీకే అరుణ హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యతగా పోలీసులు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పై కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు


రేపటి మా ప్రభుత్వానికి పునాది రాళ్లు  


 టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం రాళ్లను విసరమంటే, బీజేపీ ధర్మం ఆ రాళ్లతో రామసేతు నిర్మాణం చెయ్యడం నేర్పిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో  ప్రజల్లో పెరుగుతున్న మద్దతు, ఆదరణను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. దేవురుప్పల గ్రామం దగ్గర ప్రజల బ్రహ్మరథం మధ్య సాగుతున్న బండి సంజయ్ కుమార్ పాదయాత్ర లో కొందరు దుండగులు పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్ల చూసిన రాక్షసత్వాన్ని బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ బలప్రయోగంతో భయపెట్టి ప్రజాభిప్రాయాన్ని  ప్రభావితం చేయాలని చూస్తున్నారన్నారు. 


Also Read : Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం