Bandi Sanjay Praja Sangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో (Praja Sangrama Yatra) సోమవారం (ఆగస్టు 15) ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనగామ (Janagama) జిల్లాలోని దేవరుప్పుల (Devaruppula) మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభించారు. అయితే, దేవరుప్పుల మండలంలోకి స్థానిక బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆ పార్టీకి చెందిన యువకులు బాణసంచా కాలుస్తూ బండి సంజయ్ ను ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడుడారు.


ఈ సమయంలోనే బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా ఘర్షణకు దారి తీసింది. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్‌ మాట్లాడుతూ విమర్శలు చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో విభేదించారు. వారు బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 


దీంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, టీఆర్ఎస్ నేతలు నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరగడంతో అది దాడులకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గం రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొంత మంది బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి వారిని అదుపు చేశారు. ఈ రాళ్ల దాడిలో కొందరు నేతల తలలు పగిలిపోయాయి. వారికి రక్తం కారడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. 


సీపీపై బండి సంజయ్ ఫైర్
ఈ ఘటనపై జిల్లా సీపీని బండి సంజయ్ విమర్శించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చోవాలని అన్నారు. ఈ మేరకు డీజీపీతో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అంటూ బండి సంజయ్ నిలదీశారు. కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలే అన్నారు. తక్షణమే పాదయాత్ర సాఫీగా సాగేలా చూడాలని అన్నారు. లేకపోతే జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను బండి సంజయ్ ట్విటర్ లో పెట్టారు. ఆ తర్వాత కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు.


బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభించారు. బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రశాంతి హైస్కూల్లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. నేడు ఆయన యాత్ర బొడతండా, దేవరుప్పుల తండా, ధర్మపురం, మైలారం, గ్రామాల మీదుగా యాత్ర సాగనుంది. సాయంత్రానికి బండి సంజయ్ విస్నూర్ గ్రామానికి చేరుకొని దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.