Bandi Sanjay : అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనే యువకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆందోళన చేస్తున్నారు. భైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.  


బండి సంజయ్ ట్వీట్ 


"తెలంగాణలో ఎవరైనా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయవచ్చు. ఎందుకంటే వాళ్లను తెలంగాణ ప్రభుత్వం వాళ్లను రక్షిస్తుంది. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎటువంటి చర్య తీసుకోకుండా దైవదూషణను ప్రోత్సహిస్తుంది. కేసీఆర్ తాను నిజమైన హిందువునని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కొడంగల్‌లో విష్ణువు, శివుడు, అయ్యప్ప దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. హిందూ దేవుళ్లను అవమానించిన మునావర్ ఫారుఖీకి భద్రత కల్పించారని ఇప్పుడు భైరి నరేష్ ను కాపాడుతున్నారు. " - బండి సంజయ్  






రాజాసింగ్ ఆగ్రహం 


నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందు దేవతలను కించపరుస్తూ మాట్లాడినా నరేష్‌పై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ కుల్సుంపురలో, మొయినాబాద్‌లో, తాండూర్‌లో అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మాలధారులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైరు తెలంగాణ వ్యాప్తంగా బైరి నరేష్ పై బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు.  హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ అనే వ్యక్తిపై పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్లో బీజేపీ మహిళ నేతల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. .తక్షణమే సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ  హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన నరేష్ ని తక్షణమే అరెస్టు చేయాలని లేనియెడల జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు.  


రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన


తెలంగాణలో అయ్యప్ప మాలధారులు ఆందోళన చేస్తున్నారు. భైరి నరేష్ అనే వ్యక్తి కొడంగల్ లోని ఓ సభలో మాట్లాడుతూ శివుడు, విష్ణువు, అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  దీంతో అయ్యప్ప మాలధారులు భైరి నరేష్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌లో స్వాములు ప్రదర్శన నిర్వహిస్తుండగా భైరి నరేష్ అనుచరుడు ఒకరు వీడియో తీశారు. అదే సమయంలో భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా స్వాములతో వాదనకు దిగారు. దీంతో స్వాములు కోపోద్రిక్తులై అతనిపై దాడి చేశారు. పోలీసులు అతన్ని విడిపించి స్టేషన్‌కు తరలించారు. 


కేసు నమోదు


 మరో వైపు భైరి నరేష్ పై పోలీసులు కేసు నమోదు  చేశారు. మత విద్వేషాలను ఉపేక్షించేది లేదని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు.  అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  భైరి నరేష్ కు చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తామమని ఎస్పీ ప్రకటించారు. FIR No. 185/2022 U/s 153-A, 295-A, 298, 505(2) IPC of PS Kodangal సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు  ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదని ఎస్పీ పిలుపునిచ్చారు. అలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘతం కలుగ చేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.