Hot Comments Between HarishRao And Komatireddy Brothers: కృష్ణ జలాల విషయంలో సోమవారం తెలంగాణ అసెంబ్లీ వాడీ వేడీగా సాగింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఉదాసీనత వల్లే జల దోపిడీ జరిగిందని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వారికి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం సాగింది. నల్గొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పూర్తిగా అసత్యమైన ప్రజెంటేషన్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలగజేసుకుని ఏపీ సీఎం జగన్ స్టేట్ మెంట్ విన్న తర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు సరికావని.. అమేథీలో రాహుల్ ను కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని నిలదీశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యం వల్ల వ్యవసాయం సంగతి పక్కన పెడితే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన నల్గొండ సభకు రావాలని అన్నారు.


'హరీష్ రావు పనిచేస్తారు.. ఏం లాభం?'


మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇస్తూ కేసీఆర్ పై అలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఇతర మంత్రులు సైతం బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుండగానే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్షం లేకుండా చేయాలని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని తాము అనుకోవట్లేదని అన్నారు. 'మేము ప్రశ్నించే గొంతుకను లేకుండా చేయాలని అనుకోవట్లేదు. మేం తలుచుకుంటే మీలా చేయగలం. కానీ చేయం. బీఆర్ఎస్ ధ్వంసం చేసిన వ్యవస్థలను దారిలో పెడతాం. హరీష్ రావు కష్టించి పనిచేస్తారు. కానీ ఏం లాభం.?. ఆయన మంత్రి అయినా నిర్ణయాలన్నీ కేసీఆర్ వే. హరీష్.. కేసీఆర్, కేటీఆర్ మాటలు వినడం ఆపి మా మాటలు వినాలి.' అని వ్యాఖ్యానించారు.


'బీఆర్ఎస్ ఎందుకు మోకరిల్లింది'


ఈ క్రమంలోనే ఇతర మంత్రులు సైతం బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నదీ జలాల విషయంలో ఎందుకు మౌనంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. నీటి సమస్యలు పరిష్కరించకుండా కేంద్రానికి ఎందుకు మద్దతు తెలిపారని నిలదీశారు. 'ప్రత్యేక రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపితే ఎందుకు ప్రశ్నించలేదు?. కేంద్రం వద్ద బీఆర్ఎస్ ఎందుకు మోకరిల్లింది. పదేళ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు న్యాయమైన తెలంగాణ వాటాను సాధించలేకపోయింది. ఆ పార్టీ నేతలు తాము చేసిన తప్పులు అంగీకరించకుండా బుకాయిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరగలేదని హరీష్ రావు చెప్పగలరా.?. ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. దీనిపై నేను ఆధారాలు చూపిస్తా. కేసీఆర్, చంద్రబాబుకు రాజకీయంగా సరిపడదు. ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్ భావించారు. జగన్ కు రాజకీయ లబ్ధి కలగాలనే కేసీఆర్ సహకరించారు. రాయలసీమ ఎత్తిపోతలకు మద్దతిచ్చారు.' అంటూ జూపల్లి వ్యాఖ్యానించారు.


'అసెంబ్లీకి రాకుండా సభకు వెళ్తారా.?'


కృష్ణా జలాలపై అసెంబ్లీ చర్చ చేపట్టి, తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదామంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీకి రాని వ్యక్తి.. మంగళవారం నల్గొండ సభకు వెళ్తారా.? అని ఎద్దేవా చేశారు. ఈఎన్ సీ మురళీధర్ రావును బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మాట్లాడించిందని ఆరోపించారు. ఆయన రిటైరైనా పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో కొనసాగించారని అన్నారు. హరీష్ రావు నదీ జలాల విషయంలో సభను  తప్పుదోవ పట్టిస్తూ.. అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్లు చాలామంది ఉన్నారని.. వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Also Read: YS Jagan Speech: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం, వైఎస్ జగన్ స్పీచ్ చూశారా!