పచ్చదనం పరిమళాలు పట్టణాలకే పరిమితం కాకుండా జాతీయ రహదారుల వెంట విస్తరిస్తున్నది.  మండు వేసవిలోనూ పచ్చదనంతో, పూలవనాలతో హైదరాబాద్ కు వచ్చే నేషనల్ హైవే మార్గాలు వచ్చిపోయేవారికి కంటికి ఇంపుగా, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి అనుసంధానంగా ఉన్న నేషనల్ హైవేలు స్టేట్ హైవేల సుందరీకరణలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కీలకపాత్రను పోషిస్తున్నది. ప్రజల మనోభావాలకు, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్న కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా భవిష్యత్తుతరాలకు పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా విరివిగా పచ్చదనాన్ని పెంచి పోషిస్తున్నది.

  


వరంగల్ నేషనల్ హైవే (NH-163) వెంట ప్రస్తుతం యాదగిరిగుట్ట, రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) మల్టీలేయర్ ప్లాంటేషన్గ్రీనరీని జనగామ వరకు పొడిగించాలని సీఎం పురపాలక శాఖను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా గ్రీన్ కారిడార్ ను తలపించేలా పచ్చదనాన్ని పెంచి పోషించాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. దీంతో హెచ్ఎండీఏ యుద్ధపాతిపదికన పనులను పూర్తి చేసింది.  


తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్ నేషనల్ హైవే వెంట జనగామ వరకు దాదాపు రూ.15.04 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ రూపొందించిన మల్టీలేయర్ ప్లాంటేషన్ అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల  సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీలేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తయ్యాయి.


శ్రీశైలం హైవే (NH-765) వెంట శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మహేశ్వరం వరకు 18 కిలోమీటర్ల  సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీలేయర్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. కర్నూలు హైవే (NH-44) వెంట అరాంఘర్ నుంచి షాద్‌నగర్ వరకు 25 కిలోమీటర్ల  సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీలేయర్ ప్లాంటేషన్ హెచ్ఎండీఏ నిర్వహించింది. రాజీవ్ రహదారి స్టేట్ హైవే (SH-1) వెంట శామీర్‌పేట నుంచి గజ్వేల్ వరకు దాదాపు 39 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ నిర్వహించింది.


HMDA గ్రీనరీపై గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసింది. ఇటీవల కేరళకు చెందిన అధికారులు వరంగల్ నేషనల్ హైవే గ్రీనరీని స్టడీ చేశారు. బెర్లిన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి చార్లెట్ఎడాలిన్ హ్యూమన్ జియోగ్రఫీ అనే అంశంపై Phdలో భాగంగా హెచ్ఎండీఏ మల్టీలేయర్ ప్లాంటేషన్‌పై పరిశోధన చేశారు. 


నాందేడ్ నేషనల్ హైవే (NH-161) వెంట హెచ్ఎండీఏ మల్టీలేయర్ ప్లాంటేషన్ పచ్చటి తివాచీ పరిచింది. కంది క్రాస్ రోడ్స్ నుంచి రాంసాన్ పల్లె వరకు 32.77 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ 3.57 కోట్ల వ్యయంతో సెంట్రల్ మిడెన్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు పూర్తయ్యాయి.              


గ్రీన్ కారిడార్‌గా హైదరాబాద్ - వరంగల్ హైవే  


యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో వరంగల్ నేషనల్ హైవే వెంట గ్రీనరీ పెంచాలని ప్రభుత్వం భావించింది. తొలిదశలో వరంగల్ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను  రూ.5.5 కోట్ల అంచనాలతో  దాదాపు 30 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేశారు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు పూర్తయ్యాయి. గ్రీనరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో మల్టీలేయర్ ప్లాంటేషన్ వరంగల్ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీనరీ బ్యూటిఫికేషన్ పూర్తి కావడంతో వరంగల్ రహదారి వెంట పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయి. యాదాద్రి రూట్లో హెచ్ఎండీఏ పెంచిన మల్టీలేయర్ ప్లాంటేషన్ నేషనల్ హైవే అథారిటీకి ఆదర్శంగా నిలిచింది.