Heavy Rains In Telangana: తెలంగాణవ్యాప్తంగా రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దాని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. రుతుపవన ద్రోణి కళింగపట్నం మీదుగా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వరకూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అలాగే, వాయువ్య బంగాళాఖాతంలోనూ మరో అల్పపీడనం ఏర్పడిందని.. రాబోయే 2, 3 రోజుల్లో బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.


ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్


గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకూ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


అలాగే, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్.. జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


Also Read: Rythu Runamafi: తెలంగాణలో రుణమాఫీ నిధులు విడుదల - ఫేస్ 1లో రూ.6 వేలకోట్లకు పైగా జమ