Paddy Purchase: తెలంగాణలో రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) విమర్శలు ఎక్కుపెట్టారు. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన రైతు సంతోష్  కష్టాలే నిదర్శనం అన్నారు. చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ ఐదు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా గాగులాపూర్ అన్నపూర్ణ రైస్ మిల్లుకు వారి గ్రామం నుంచి ఐదు లారీలు వడ్లను పంపారని, వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ విమర్శించారు. 


అధికారుల జాప్యంతో మొలకెత్తుతున్న ధాన్యం
అధికారులు జాప్యం, నిర్లక్ష్యం కారణంగా ధాన్యం మొలకెత్తిందని, ఇప్పుడు కొనడం సాధ్యం కాదని చెబుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఇంటికి తీసుకెళ్లాలని అధికారులు రైతులను ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. రైతు సంతోష్ కాళ్లా వేళ్లా పడితే లారీకి 50 బస్తాలు తరుగుతీస్తేనే కొంటామని, లేకపోతే కొనమని నిర్లక్ష్యంగా చెబుతున్నారని ఆరోపించారు. ఐదు రోజులుగా డ్రైవర్లకు భోజనాలు, వసతి సదుపాయాల ఖర్చును సంతోష్‌తోపాటు గ్రామస్తులు భరిస్తున్నారని హరీష్ రావు ట్విటర్‌లో రాసుకొచ్చారు. ప్రభుత్వం మొలకెత్తిన వడ్లను కొంటామని చెబుతున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని, రైతు సంతోష్ తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్, సిద్దిపేట కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి సంతోష్ సమస్యను పరిష్కరించాలని కోరారు.






ధాన్యం కొంటాం: డిప్యూటీ సీఎం బట్టి
గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధ్యాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వారిని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో 15 రోజుల ముందు నుంచే ధాన్యం కొంటున్నామని 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.


చివరి గింజ వరకు కొంటాం
బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని బట్టి విక్రమార్క చెప్పారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని, రైతులను నిలువునా ముంచిన చరిత్ర బీఆర్ఎస్‌దని విమర్శించారు. తమ ప్రభుత్వంలో తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రంలో చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా కల్పించారు. ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే డబ్బు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని బట్టి హితవు పలికారు.