Harish Rao Comments on Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2024పై మాజీ ఆర్థిక మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను మర్చిపోయి బడ్జెట్ రూపొందించిందని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకంతో పాటు పింఛనును రూ.4 వేలు చేస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కారని హరీశ్ రావు విమర్శించారు.


‘‘రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి ఆత్మస్తుతి, పరనిందగా ఉంది. ప్రజల ఆశలను వమ్ము చేశారు. హామీలకు కేటాయింపులు లేవు. ఆరు గ్యాంరటీలకు కేటాయింపులు లేవు. అభివృద్ధి అగమ్య గోచరం. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడిపే బడ్జెట్ ఇది. ఎన్నికల్లో గ్యారంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపులేవీ? 


ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాలన్నారు. బడ్జెట్లో ఆ ప్రసక్తి లేదు. మేం అప్పులు చేశామని నిందించారు. భట్టి 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారు. మా ప్రభుత్వం తెచ్చినదానికంటే 17 వేల కోట్లు ఎక్కువ తెస్తామన్నారు. భట్టి ఆరు గ్యారంటీలను తన బడ్జెట్లో పూర్తిగా మరిచిపోయారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఇస్తామన్న రూ.2500 గురించి ప్రస్తావించలేదు. మహాలక్ష్మి పథకంపై బడ్జెట్ మహా నిరాశ కలిగించింది. రూ.4 వేల పింఛను ఇస్తామని బాండు పేపర్ మీద రాశారు. మరి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదు?


విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదు. జాబ్ క్యాలండర్, 4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదు. ఆటో కార్మికులకు 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో మొండిచేయి చూపారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులకు గుండు సున్నా చూపారు. గత ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అనడం అన్యాయం. కేసీఆర్ అభివృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకుంటున్నది కాంగ్రెస్. దేశంలో తలసరి ఆదాయంలో 13 స్థానంలో ఉన్న తెలంగాణను మేం నంబర్ 1 స్థానంలో తీసుకొచ్చాం. 


తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువ
తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల 47 వేల 99 రూపాయలు అయితే, దేశ తలసరి ఆదాయం లక్షా 83 వేల 236. అంటే రాష్ట్ర పౌరుడి తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయానికంటే 1 లక్ష 64 వేల 63 రూపాయలు ఎక్కువ. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఫలితం. బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4 లక్షల 51 వేల కోట్ల 580 కోట్లు.  2023-24 నాటికి అది  14 లక్షల 63 వేల 963 కోట్లు. అంటే మూడు రెట్లు పరిగింది. దేశం జీడీపీ కంటే 2 శాతం ఎక్కువ. 


తెలంగాణ వృద్ధి రేటు 11.9 శాతం కాగా దేశ వృద్ధి రేటు 9.1 శాతమే. తెలంగాణ గ్రోత్ రేటు బావుందని నీతి ఆయోగ్ కూడా మెచ్చుకుంది. వ్యవసాయానికి ఊతమిచ్చి కోటి 27 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడిని  4 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచాం. పంజాబ్‌ను తలదన్ని ఎదిగామంటే కేసీఆర్ పనితీరు కారణం కాదా? పండిన పంట నిజం కాదా? మీ బడ్జెట్లో ఏదో చెప్పినంత మాత్రాన నిజాలు నిజం కాకుండా పోతాయా? 


వారికి సున్నా నిధులు
బడ్జెట్లో గొల్ల కుర్మలకు మోసం చేశారు. గతేడాది 50 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పుడు సున్నా కేటాయించారు. పింఛన్లు పెంచడం లేదని అర్థమైంది. గతేడాది 7335 కోట్లు పెడితే, ఇపుడు 7376 కోట్లు మాత్రమే పెట్టారు. ఈసారి కొత్త పింఛన్ ఇవ్వరని తేలిపోయింది. ఆగస్ట్ 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. 31 వేల కోట్లు ఇస్తామన్నారు. కానీ బడ్జెట్లో 15470 కోట్లు మాత్రమే కేటాయించారు? ఈ నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం?


రైతుబంధు స్థానంలో రైతుభరోసా అన్నారు. దాని ఊసు కూడా లేదు. మైనారిటీలకు 4 వేల కోట్లని మేనిఫెస్టోలో చెప్పి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఐదేళ్లలో ప్రతి సంవత్సరానికి బీసీలకు 20 వేల కోట్ల ఇస్తామని చెప్పి 9 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇరిగేషన్‌కు కూడా నిధులు తగ్గించారు. పోయినేడాది మేం 26 వేల 825 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 22 వేల 300 కోట్లు మాత్రమే కేటాయించారు. దళితబంధు 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామన్నారు. ఆ ప్రస్తావన కూడా లేదు. గిరిజన బంధులేదు. 


వైన్ షాపులు పెంచుతారా?
గత బడ్జెట్లో నేను చూపిన ఎక్సైజ్ ఆదాయం 18 వేల 470 కోట్లు. భట్టిగారు ప్రతిపాదించింది 25 వేల 617 కోట్లు. అంటే ఏడు వేల కోట్లు ఎక్కువ. గల్లీకో వైన్ షాప్ పెడతారా? ఎక్సైజ్, వ్యాట్ కలుపుకుంటే 15  వేల కోట్ల ఎక్కువ ఆదాయం రాబడతామని చెప్పారు. అంటే తాగుబోతు తెలంగాణను తయారుచేస్తారా? స్టాంపు డ్యూటీ ఆదాయం 14వేల 295 కోట్లని గత బడ్జెట్లో నేను ప్రతిపాదిస్తే  భట్టి 18 వేల 228 కోట్లు అన్నారు.  అంటే 4 వేల కోట్ల ఎక్కువ. భూముల విలువ, రిజిస్ట్రేషన్, పన్నుల భారం పెంచుతామని చెప్పకనే చెప్పారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం లేదు. నెలకు 7 వేల కోట్లను వడ్డీ కింద కడుతున్నామని సీఎం, భట్టి చెబుతున్నారు. వచ్చే ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ 17వేల 729 కోట్లని చూపించారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఈ బడ్జెట్ ప్రజల ఆశలను నీరుగార్చింది’’ అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.