తిరుమలలో తెలంగాణ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారన్నారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఓటమి‌ భయం పట్టుకుందని, అందుకే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని విమర్శించారు. 


ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసీఆర్ ఆన్నారని, ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని కేసీఆరే విమర్శించారని గుర్తు చేశారు. ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారంటే కేసీఆర్ ఓటమి పాలు అవుతున్నట్లు ఒప్పుకుంటున్నారని అన్నారు. అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు. తెలంగాణలో వరుస ఎన్నికలలో బీజేపీకే ప్రజలు పట్టం కడుతున్నారని ఆయన తెలిపారు.


ప్రాణహిత పుష్కరాలకు నిధులేవీ?


బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిన్న ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న పుష్కరాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆయన కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కర పుణ్య స్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి మరీ రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయాన్ని వివేక్ గుర్తు చేశారు. 


ఫామ్ హౌస్ లో యజ్ఞాలు చేసి తాను పెద్ద భక్తుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి.. పుష్కరాల సందర్భంగా పూజ నిర్వహించేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆపి కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిండని వివేక్ ఆరోపించారు. ఈ అంశం నుంచి దృష్టి మరల్చడానికే ప్రాణహిత పుష్కరాలకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోందని వివేక్ అన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. వరంగల్ సభలో కేటీఆర్ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్న ఆయన.. రాష్ట్రానికి కేంద్రం నిధులు మంజూరు చేయడంలేదన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.