Telangana Famous Foods: తెలంగాణ అంటే మనకు గుర్తొచ్చేది భిన్నమైన సంస్కృతులు, ప్రసిద్ధి చెందిన కళలు, కళాకారులు, పండుగలు, జాతరలే కాదు, . అద్భుతమైన వంటకాలు కూడా. ఓవైపు భాగ్యనగరం అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు ఫేమస్ ఫుడ్స్‌ను సైతం పర్యాటకులు లాగించేస్తుంటారు. హైదరాబాద్ బిర్యానీ దగ్గర నుంచి అంకాపూర్ కోడి కూర, ఒట్టి చేపల కూరలతో పాటు బొబ్బర్లు, సకినాలు, సర్వపిండి, గిరిజాలు ఇలా ఎన్నో వంటకాలు ప్రసిద్ధి చెందాయి. వీటిల్లో కొన్నింటిని పలు పండుగల సందర్భాల్లో నైవేద్యంగా సమర్పిస్తే.. మరికొన్ని పౌష్టికాహారంతో కూడుకున్నవి ఉన్నాయి. మరి ఆ ఫేమస్ ఫుడ్స్ గురించి ఓసారి చూస్తే.!


హైదరాబాద్ బిర్యానీ


బిర్యానీ.. ఈ పేరు వింటేనే అందరికీ నోరూరుతుంది. అందులోనూ హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ప్రత్యేకం. హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ టైంలోనైనా బిర్యానీ కోసం ఫుడ్ లవర్స్ హోటల్స్ ముందు క్యూ కడుతుంటారు. ప్రతిరోజూ రూ.కోట్లలోనే బిర్యానీ వ్యాపారం జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదేమో. 1518 - 1687 మధ్య హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్ షాహీల ద్వారా బిర్యానీ పర్షియా నుంచి హైదరాబాద్ కు వచ్చింది. బిర్యానీ తయారీలో వాడే ముడి సరకులు దానికి మరింత రుచిని అందిస్తాయి. కేవలం రుచిపరంగానే కాకుండా ఆరోగ్యానికి దోహదపడేవి కూడా ఇందులో ఉన్నాయి. కింద వెడల్పు, పైన చిన్నగా ఉండే పాత్రలో మాంసంతో పాటు బియ్యాన్ని ఆవిరి రూపంలో ఉడికించి తయారుచేస్తారు కాబట్టే దీన్ని దమ్ బిర్యానీ అంటారు. మరి మీరు టేస్ట్ చేశారా.. వేడి వేడి దమ్ బిర్యానీ..


హైదరాబాద్ హలీం


హలీం.. అంటేనే మనకు గుర్తొచ్చేది రంజాన్ మాసం. ముస్లిం సంప్రదాయ వంటకంగా పేరొందిన ఈ వంటకం.. క్రమేణా అందరికీ ఇష్టంగా మారిపోయింది. అసలు హలీం పుట్టింది భాగ్యనగరంలోనేనని తెలుసా.!. ఇరాన్ కు చెందిన హుస్సేన్ జాబిత్ 1947లో మదీనా సర్కిల్ లో ఓ హోటల్ నెలకొల్పాడు. విభిన్న ఇరాన్ వంటకాలను నగరవాసులకు రుచి చూపించాడు. 1956లో రంజాన్ మాసం ప్రారంభమైన తొలి రోజు 'హలీం' పేరుతో ఓ కొత్త వంటకాన్ని తయారుచేసి, ఇవ్వడం ప్రారంభించడంతో దీని ప్రస్థానం ప్రారంభమైంది. నిజానికి హలీంను గోధుమలు, మాంసం, నెయ్యి సమానంగా ఉపయోగించి తయారు చేస్తారు. తొలుత పెద్దగా ఆదరణ లభించనప్పటికీ ఆ తర్వాత వినూత్న ప్రచారంతో హలీంను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో 1961 నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికీ హలీం అంటే ఫుడ్ లవర్స్ నోళ్లలో నీళ్లూరుతాయి.


అంకాపూర్ కోడి కూర


నాటుకోడి కూర.. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది అంకాపూర్ దేశీ చికెన్ కూర. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామంలో వండే  ఈ నాటుకోడి కూర రుచి ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా పండుగ సందర్భాల్లో తెలంగాణలోని ప్రాంతాల్లో ముక్క లేనిదే ముద్ద దిగదు. విందు భోజనాల్లోనూ కోడి కూర, మటన్ తప్పనిసరి. హోంమేడ్ మసాలాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర వంటి వాటితోనే ఈ కోడి కూరకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.


చేపల పులుసు


చికెన్, మటన్ తిని బోర్ కొడుతోంది అనుకునే వారికి తెలంగాణ చేపల పులుసు చాలా ఫేమస్. బొమ్మెలు, రావులు, బొచ్చెలు, వాలుగు.. తెలంగాణలో ఎక్కువగా దొరికే చేపలు. వీటిలో బొమ్మెల (కొర్రమీను) పులుసు మరింత ప్రత్యేకం. ముళ్లు తక్కువగా ఉండే వీటి ధర మటన్ తో సమానం. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో దొరికే వీటి రుచి అద్భుతం. అందుకే వీటిని తినేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అలాగే, ఒట్టి చేపలకూరను సైతం ఇష్టంగా తింటారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలకు వీటిని నైవేద్యంగానూ సమర్పిస్తారు. 


సర్వపిండి


తెలంగాణలో సర్వపిండి పేరు వినని వారే ఉండరు. పల్లె ప్రాంతాల్లో దీన్ని గంజుపిండి అని కూడా పిలుస్తారు. బియ్యపు పిండి, వేరుశనగతో దీన్ని తయారు చేస్తారు. వరంగల్ జిల్లాలోని బొల్లెపల్లి గ్రామం ఈ సర్వపిండికి ప్రసిద్ధి. ఏళ్ల క్రితం గ్రామంలోని ఓ మహిళ తన ఇంట్లో ఉన్న బియ్యపు పిండితో తక్కువ నూనెను ఉపయోగించి ఓ ప్రత్యేక వంటకం తయారు చేసిందని అదే సర్వపిండిగా మారిందని చెప్తారు. అటు, కరీంనగర్ లోనూ సర్వపిండి అమ్మకాలు జోరుగా సాగుతాయి. దీన్ని అల్పాహారంగా ఎక్కువగా తీసుకుంటారు. అటు, జొన్న రొట్టె, సజ్జ రొట్టెలు సైతం అల్పాహారంగా ఇష్టంగా తింటారు. ఇవి పౌష్టికాహారంగానూ ఎంతో ప్రాముఖ్యత పొందాయి.


మలిదలు


తెలంగాణ సంప్రదాయ ఆహారం మలిదలు. మిగిలిపోయిన చపాతీ లేదా రొట్టెలతో చేసే రుచికరమైన లడ్డూనే 'మలిదలు' అంటారు. చపాతీలను ముక్కలుగా చేసి ముతకగా రుబ్బిన తర్వాత బెల్లం, నెయ్యి వేసి ఆ మిశ్రమాన్ని లడ్డూలుగా చేస్తారు. వీటికి డ్రై ఫ్రూట్స్ కలిపితే మరింత రుచికరంగా మారుతాయి.


సంక్రాంతి పిండి వంటలు


సంక్రాంతి సందర్భంగా తెలంగాణలో కొన్ని ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తారు. సకినాలు, అరిసెలు, చెగోడీలు, గరిజాలు వంటివి చాలామంది ఇష్టంగా తింటారు. బియ్యం పిండితో వృత్తాలుగా చేసి నూనెలో వేయిస్తారు. ఈ సకినాలు చాలా రోజులు నిల్వ ఉంటాయి. శుభకార్యాల్లో తయారు చేసుకునే పిండి వంటకాల్లోనూ సకినాలు మొదటి స్థానంలో ఉంటాయి. 


తెలంగాణలోని అంకాపూర్ గ్రామంలో మొక్కజొన్నతో చేసిన మక్క గూడాలు, మక్క వడలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే, మిల్లెట్స్, ఉల్లిపాయలు, మిర్చి వంటి వాటితో చేసిన బొబ్బర్లు సైతం ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి.