ఈటల రాజేందర్ కు వై ప్లస్ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు (జూలై 1) ఉదయం నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ కు వై ప్లస్ స్టేట్ కేటగిరి భద్రత ఏర్పాటు చేయనున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈటల రాజేందర్ వెంట ఉండనున్నారు. భద్రతకు సంబంధించి నిన్న (జూన్ 29) మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ రావు నిన్న ఈటల రాజేందర్ ను కలిసి వివరాలు సేకరించారు. ప్రాణహానికి సంబంధించిన వివరాలను ఈటల నుంచి సేకరించారు. దీనికి సంబంధించి డీజీపీకి సీల్డు కవర్‌లో డీసీపీ సందీప్ నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఎమ్మెల్యే ఈటల హుజురాబాద్‌తో పాటు ఇతర జిల్లాల పర్యటనల్లో అనుమానాస్పద రీతిలో కార్లు తిరుగుతున్నాయని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఈటల మీడియాకు వెల్లడించిన వెంటనే మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. స్వయంగా చొరవ తీసుకొని డీజీపీ‌కి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఈటల రాజేందర్ ను కలిసి వివరాలను సేకరించినట్లుగా మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపారు.